ఆగస్టు నాటికి 50వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు: కేటీఆర్

by  |
ఆగస్టు నాటికి 50వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు: కేటీఆర్
X

దిశ, న్యూస్‌బ్యూరో: ఆగస్టు నాటికి 50వేల డబుల్ బెడ్‌రూం ఇండ్లను పేదలకు అందించనున్నట్టు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో బుధవారం జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ‘జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్ రూం ఇండ్లు‘ అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మక చేపట్టిందని, నగరంలోనే సుమారు లక్ష ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. లాక్‌డౌన్ ఉన్నప్పటికీ నిర్మాణ పనులు నిరంతరం కొనసాగుతున్నట్లు డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ వర్కింగ్ ఏజెన్సీలు మంత్రుల దృష్టికి తీసుకు వచ్చాయి. చాలా చోట్ల 80శాతానికి పైగా నిర్మాణాలు పూర్తయ్యాయని, మిగిలిన సైట్లలో నిర్మాణాలను పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో వేగంగా పనిచేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. పూర్తయిన ఇండ్లను జీహెచ్ఎంసీ ఆధీనంలోకి తీసుకోవాలని సూచించారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంలో సింహభాగం హైదరాబాద్ నగరంలోనే నిర్మిస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటిదాకా సుమారు పదివేల మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను హైదరాబాద్‌లో అందించామని, రానున్న రోజుల్లో ప్రాంతాల వారీగా ఇళ్లను లబ్ధిదారులకు అందించే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్ , పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్ పాల్గొన్నారు.

పార‌ద‌ర్శ‌కంగా డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లు కేటాయింపు: మేయర్
ఆగ‌స్టు నెలాఖ‌రు వ‌ర‌కు 50 వేల ఇండ్లను పూర్తి చేసి ల‌బ్దిదారుల‌కు అంద‌జేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణయించిన నేపథ్యంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్ మీడీయాతో మాట్లాడారు. డ‌బుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాన్ని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకొని నాణ్య‌మైన మెటీరియ‌ల్‌ను వినియోగిస్తున్న‌ట్లు తెలిపారు. క‌మ్యూనిటీ వ‌స‌తుల‌ను కూడా పూర్తిస్థాయిలో క‌ల్పిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. అర్హులైన పేద‌ల‌కు మాత్ర‌మే ఈ ఇండ్లు కేటాయిస్తామని, ల‌బ్దిదారుల ఎంపిక ప్ర‌క్రియ పూర్తిగా పార‌ద‌ర్శ‌కంగా జ‌రుగుతుంద‌న్నారు. పేద ప్ర‌జ‌లు ద‌ళారుల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని సూచించారు.

Next Story

Most Viewed