500 కొవిషీల్డ్ ఇంజెక్షన్స్ చోరీ.. ఎక్కడంటే..!

by  |
500 కొవిషీల్డ్ ఇంజెక్షన్స్ చోరీ.. ఎక్కడంటే..!
X

దిశ, శేరిలింగంపల్లి : కరోనా కాటుకు వేలాది మంది మృత్యువాత పడుతుండగా, లక్షలాది మంది వ్యాధి బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా టీకాల కోసం కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు. ఒక్కడోస్ ఇంజెక్షన్ అయినా చాలు అని బాధితులు పడిగాపులు కాస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శేరిలింగంపల్లిలోని నియోజకవర్గం కొండాపూర్ లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వందలాది వ్యాక్సిన్ డోస్ లు అపహరణకు గురయిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ సంఘటన ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది బాధ్యతరాహిత్యాన్ని మరోసారి బహిర్గతం చేసింది. వ్యాక్సిన్ల చోరీకి సంబంధించి ఆసుపత్రి సూపరింటెండెంట్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, ఆసుపత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం… కొండాపూర్‌లోని జిల్లా ఆసుపత్రిలో గల వ్యాక్సికేషన్​ సెంటర్‌లో గత కొద్దికాలంగా కరోనా రోగులకు వ్యాక్సిన్ వేస్తున్నారు.

మరో 500డోసులకు సరిపడా ఉండాల్సిన 50 కొవిషీల్డ్​ వాయిల్స్​ వ్యాక్సినేషన్ సెంటర్ లోనే భద్రపరిచారు. కానీ గురువారం నాడు 50 వాయిల్స్ కనిపించకుండా పోయాయి. విషయం గ్రహించిన సిబ్బంది సూపరిండెంట్​దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో సూపరిండెంట్​ డా. దశరథ్​ వ్యాక్సికేషన్​ సెంటర్​ సిబ్బంది తీరుపై అనుమానం వ్యక్తం చేస్తూ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని ఆసుపత్రిలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు గచ్చిబౌలి ఇన్ స్పెక్టర్ సురేష్​ తెలిపారు. అయితే సిబ్బంది మాత్రం తమకు ఎలాంటి సంబంధం లేదని సూపరింటెండెంట్ కావాలనే తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు.

వ్యాక్సిన్ల చోరీపై బీజేపీ ఆందోళన

వాక్సిన్ కొరత ఉన్న ఇలాంటి సమయంలో టీకాలు చోరీకి గురి కావడం చాలా బాధాకరమని, ఈ చోరీ ఎలా జరిగిందనే విషయంపై ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ చోరీ వెనక ఎవరెవరూ ఉన్నారనేది వెంటనే తేల్చాలని, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.



Next Story

Most Viewed