యాసంగిలో 50 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తి

by  |
Minister Gangula Kamalakar
X

దిశ, కరీంనగర్ సిటీ : ఈ యాసంగి సీజన్లో ఇప్పటివరకు యాభై శాతం ధాన్యం కొనుగోలు పూర్తి చేసినట్లు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బుధవారం నగరంలోని మీ సేవ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కరోనా సాకు చూపి ధాన్యం కొనుగోళ్లను నిలిపివేసినా, తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందన్నారు.

గత ఏడాదితో పోలిస్తే ఈసారి, రెట్టింపు దిగుబడులు వచ్చాయని తెలిపారు. యాసంగిలో ఎకరానికి 30 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడులు రాగా, ఈ సారి 80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే 50శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని స్పష్టం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 6850 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇప్పటికే కొనుగోళ్లు పూర్తై 150 కేంద్రాలు మూసివేసినట్లు ప్రకటించారు. ధాన్యం ఎగుమతి ,దిగుమతుల్లో బీహార్ కూలీలు సేవలు అందించేవారని, లాక్ డౌన్ కారణంగా చాలా మంది కార్మికులు వెళ్లి పోయినందువల్ల ధాన్యం తరలింపుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. ఇప్పటివరకు 46లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినా, గోదాముల్లోకి తరలించటంలో ఎఫ్‌సీఐ తాత్సారం చేస్తుందన్నారు. వర్షానికి ధాన్యం తడిసినా రైతులు ఆందోళన చెందవద్దని, తడిసిన వరి ధాన్యం కూడా తప్పకుండ కొనుగోలు చేస్తామని వెల్లడించారు.

సిరిసిల్ల, ఖమ్మంలో పంట అధికంగా ఉన్నా మిల్లులు లేవని, ఆ ధాన్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నందున కాస్త ఆలస్యం అవుతోందన్నారు. రుణాలున్నాయని బ్యాంకులు రైతుల డబ్బు ఆపుతున్నట్లైతే, లోన్లు ఉన్న అకౌంట్లు కాకుండా వేరే అకౌంట్లు ఇచ్చుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లకు రూ.20 వేల కోట్లతో పాటు గన్నీ సంచులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.1886 మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు.


Next Story