‘గాల్వన్ ఘటనలో 45 మంది చైనా జవాన్లు మరణించారు’

by  |
‘గాల్వన్ ఘటనలో 45 మంది చైనా జవాన్లు మరణించారు’
X

న్యూఢిల్లీ: గాల్వన్ ఘటనలో 45 మంది చైనా జవాన్లు మరణించినట్టు రష్యన్ న్యూస్ ఏజెన్సీ టీఏఎస్ఎస్ రిపోర్టు చేసింది. గతేడాది జూన్‌లో భారత్ చైనా సరిహద్దులో లడాఖ్‌లోని గాల్వన్ లోయలో చోటుచేసుకున్న ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు అమరులవ్వగా, 45 మంది చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ఘటన జరిగిన తర్వాత అమెరికా సహా ఇతర ఇంటెలిజెన్స్‌ల రిపోర్టులు దాదాపుగా ఇదే సంఖ్యను పేర్కొన్నాయి. సుమారు 40 మంది చైనా జవాన్లు మరణించారన్న వార్తలను చైనా అప్పుడు ఖండించడం గమనార్హం.

గతేడాది మే, జూన్‌లలో సరిహద్దులో ఉభయ దేశాల సైన్యం మధ్య ఘర్షణలు జరిగాయి. జూన్ 20న ఇవి హింసాత్మకంగా మారాయి. ఆయుధాలు లేకుండా ఇనుప రాడ్లు, కంచెలు, ఇతర పరికరాలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో భారత వైపున 20 మంది మరణించినట్టు కేంద్రం వెల్లడించింది. ఇందులో 16 బిహార్ ఇన్ఫాంట్రీ బెటాలియన్ కమాండింగ్ అధికారి సంతోశ్ బాబు కూడా ఉన్నారు. కాగా, చైనా మాత్రం ఆ ఘర్షణలో మరణించిన వారి సంఖ్యపై వ్యాఖ్యానించడానికి నిరాకరిస్తూనే వస్తున్నది. ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన చేయలేదు. తాజాగా, రష్యా వార్తా ఏజెన్సీ వెల్లడించింది.



Next Story

Most Viewed