కేంద్ర క్యాబినెట్‌లో కళంకితులు.. ADR రిపోర్టులో ఆశ్చర్యకర విషయాలు

by  |
కేంద్ర క్యాబినెట్‌లో కళంకితులు.. ADR రిపోర్టులో ఆశ్చర్యకర విషయాలు
X

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చేపట్టారు. కొంతమంది పాత మంత్రులకు ఉద్వాసన పలికి కొత్తగా 36 మందికి చోటు కల్పించి మంత్రివర్గంలో సభ్యుల సంఖ్యను 78కి పెంచిన సంగతి తెలిసిందే. విస్తరించిన మంత్రివర్గంలో చాలా మంది విద్యాధికులు. పలురంగాల్లో నైపుణ్యం కలిగినవారు కూడా. వీటికితోడు మంత్రివర్గంలో క్రిమినల్ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్నవారు, సంపన్నులూ ఉన్నారు. మరొక విషయం ఏంటంటే మంత్రివర్గ విస్తరణ తర్వాత క్రిమినల్ కేసుల్లో దర్యాప్తు ఎదుర్కొంటున్నవారి సంఖ్య పెరిగింది. ఎన్నికల అఫిడవిట్ ఆధారంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్(ఏడీఆర్) రూపొందించిన నివేదిక ఆశ్చర్యకర అంశాలను వెల్లడించింది. ప్రస్తుత 78 మంత్రుల్లో 33 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. ఇందులో 24 మందిపై హత్య, హత్యాయత్నం, దోపిడీలకు సంబంధించిన సీరియస్ కేసులున్నాయి. 2019లో 56 మంత్రులతో ఏర్పడ్డ కేంద్ర క్యాబినెట్‌లో 39శాతం మంది మంత్రులపై కేసులున్నాయి. తాజాగా, ఈ సంఖ్య మరో మూడు శాతం పెరిగింది. దాదాపుగా ప్రతి కేంద్ర మంత్రీ సంపన్నులే. పాత క్యాబినెట్, విస్తరించిన క్యాబినెట్‌లకు ఈ విషయం పెద్దగా తేడాలేమీ లేవు.

అతిసంపన్నుడు జ్యోతిరాదిత్య సింధియా

కొత్త క్యాబినెట్‌లో 90 శాతం మంది మంత్రులు మిలియనీర్లే. అంటే 70 మంది మంత్రుల కనీస ఆస్తి కోటికి పైనే ఉన్నది. వారు స్వయంగా తమ ఆస్తులను ప్రకటించిన ఎన్నికల అఫిడవిట్ వివరాలనే ఏడీఆర్ పేర్కొంది. ఇందులోనూ నలుగురు మంత్రులు అతిసంపన్నుల జాబితాలోకి వెళ్తారు. సుమారు రూ. 379 కోట్లతో జ్యోతిరాదిత్య సింధియా క్యాబినెట్‌తో అత్యంత సంపన్నుడుగా ఉన్నారు. తర్వాతి స్థానంలో పియూశ్ గోయల్(రూ. 95 కోట్లు), నారాయణ్ రాణె(రూ. 87 కోట్లు), రాజీవ్ చంద్రశేఖర్(సుమారు రూ. 64 కోట్లు) ఉన్నారు. ఈ నలుగురు రూ. 50 కోట్ల ఆస్తులున్న జాబితాలో ఉంటారు. మొత్తంగా క్యాబినెట్‌లో మంత్రుల సగటు ఆస్తులు రమారమి రూ. 16.24 కోట్లుగా ఏడీఆర్ గణించింది.

చివరి స్థానంలో ప్రతిమ భౌమిక్

క్యాబినెట్‌లో సంపన్నుల జాబితాలో త్రిపురకు చెందిన ప్రతిమ భౌమిక్ చివరిస్థానంలో ఉన్నారు. భౌమిక్ కంటే ముందు వరుసగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన జాన్ బార్లా(రూ. 14 లక్షలు), రాజస్తాన్‌కు చెందిన కైలాశ్ చౌదరి(రూ. 24 లక్షలు), ఒడిశా నుంచి బిశ్వేశ్వర్ తుడు(రూ. 27 లక్షలు), మహారాష్ట్ర నుంచి వీ మురళీధరన్(రూ. 27 లక్షలు) ఉన్నారు. విద్యార్హతల వివరాలనూ నివేదిక వెల్లడించింది. 21 మంది మంత్రులు పీజీ పట్టా, తొమ్మిది మంది డాక్టరేట్ పొందినవారు, 17 మంది గ్రాడ్యుయేట్లు, ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్లున్నారు. ఏడుగురు మంత్రులు 8వ తరగతి, ముగ్గురు మంత్రులు పదవ తరగతి, ఇద్దరు మంత్రులు ఎనిమిదవ తరగతి పాస్ అయ్యారు.



Next Story

Most Viewed