40 మంది విద్యార్థినుల నిర్బంధం!

by  |
40 మంది విద్యార్థినుల నిర్బంధం!
X

కర్నూలు జిల్లా ఆత్మకూరులో అద్దె చెల్లించేంతవరకు పంపేది లేదంటూ హాస్టల్ విద్యార్థినులను బంధించిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో హాస్టళ్ల నిర్వహణాతీరును కళ్లకు కడుతోంది. వెనుకబడిన తరగతుల విద్యార్థులకు వసతి పేరిట రాష్ట్ర ప్రభుత్వం దశాబ్దాల క్రిందట హాస్టళ్లను ఏర్పాటు చేసింది. అవి శిధిల స్థితికి చేరుకోవడంతో అద్దె భవనాల్లో హాస్టళ్లను నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో ఆత్మకూరులోని పెద్దబజారు ప్రాంతంలో పాత ప్రైవేటు భవనంలో ప్రభుత్వ వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. గాలి వెలుతురు ప్రవేశించని ఆ ఇరుకు గదుల్లో 40 మంది విద్యార్థునులకు వసతి కల్పించారు. ఒక్కటే టాయిలెట్, వాష్ రూమ్ ఉండగా, ఆ భవనం ముందు భాగంలో దుకాణం ఉంటుంది. దాని పక్కనే ఉన్న చిన్నపాటి ద్వారం నుంచి బాలికలు రాకపోకలు సాగించాల్సి వస్తోంది.

తీవ్ర విమర్శలు, విద్యార్థినుల ఆందోళనతో హాస్టల్‌ వార్డెన్‌ సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకుపోయారు. మరో భవనంలోకి మారేందుకు అనుమతి తీసుకున్నారు. దీంతో హాస్టల్‌ను వెంగళ్‌రెడ్డినగర్‌లోని ఒక భవంతికి మార్చాలని నిర్ణయించారు. భవనం ఖాళీ చేస్తుండగా భవన యజమాని వారిని అడ్డుకుని, తనకు రావాల్సిన 5 నెలల అద్దె రూ.47,500 చెల్లించాలని, విద్యార్థినులు పాడుచేసిన గోడలను బాగుచెయ్యాలని డిమాండ్ చేశారు. వార్డెన్‌ సమాధానం చెప్పకపోవడంతో బాలికలు, సిబ్బందిని లోపల ఉంచి భవనానికి తాళం వేశారు.

దీంతో విద్యార్థినులు భవనంపైకి ఎక్కి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని తాళం తెరిపించారు. దీంతో విద్యార్థినులు కొత్త హాస్టల్‌కు వెళ్లి షాకయ్యారు. అది మరింత అధ్వాన్నంగా ఉంది. అక్కడ కనీస అవసరాలైన తాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు కూడా లేవు. అక్కడుండేందుకు విద్యార్థినులు నిరాకరించారు. దీంతో గోడకు కొట్టిన బంతుల్లా మళ్లీ పాత హాస్టల్‌కే విద్యార్థినులను తిరిగి తెచ్చారు.

tags : government hostels, karnool district, atmakur, girls hostel



Next Story