పీక్స్ వైపు దూసుకుపోతున్న కరోనా

by  |
carona 1
X

న్యూఢిల్లీ : థర్డ్ వేవ్ ముప్పు తప్పదని హెచ్చిరిస్తున్న నిపుణుల అంచనాలను నిజం చేస్తూ దేశంలో కరోనా మహోగ్రరూపం దాల్చుతున్నది. ‘ఇక తగ్గినట్టే..’ అనుకున్న ప్రతిసారి విజృంభిస్తూ నానాటికీ ఉద్ధృతిని పెంచుతున్నది. గడిచిన రెండు నెలలుగా నిపుణులు కడుతున్న అంచనాలను వాస్తవ రూపం దాల్చుతూ రోజుకు ఐదు లక్షల కేసుల దిశగా వేగంగా పయనిస్తున్నది. మే 15 నాటికి దేశంలో కరోనా పీక్ స్టేజ్‌కు వెళ్తుందని, రోజుకు 10 లక్షల వరకు కేసులు వచ్చే ఆస్కారముందని పలువురు నిపుణుల శాస్త్రీయ అంచనా. అదే నిజమన్నట్టుగా బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు దేశంలో 4,12,262 మంది కరోనా బారిన పడ్డారు. ఇదే సమయంలో మరణాలు 4 వేలకు అత్యంత చేరువ (3,980)గా రికార్డయ్యాయి.

భారత్‌లో ఏప్రిల్ 30 న మొదటిసారిగా 4 లక్షల కేసులు నమోదుకాగా.. ఆ తర్వాత ఐదు రోజులు తగ్గినట్టే కనిపించాయి. వరుసగా మూడు రోజులు కేసులు తగ్గడంతో ఇక సెకండ్ వేవ్ తగ్గుతుందని అనుకుంటున్న తరుణంలో బుధవారం నుంచి కేసులు మళ్లీ పెరగగా.. నేడు కొత్త రికార్డులను టచ్ చేశాయి. మే మధ్య నాటికి నాటికి దేశంలో రోజూవారీ కరోనా కేసులు 10 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని, అదే సమయంలో యాక్టివ్ కేసులు 38 లక్షల నుంచి 48 లక్షల మధ్య ఉంటాయని ఐఐటీ కాన్పూర్, ఐఐటీ హైదరాబాద్ వర్సిటీలు గతనెలలో హెచ్చరించిన విషయం తెలిసిందే. అవి చెప్పినట్టుగానే ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 35 లక్షలు (35,66,398) గా ఉన్నాయి. ప్రస్తుతం కేసుల ట్రెండ్ చూస్తే అవి మరో 10 లక్షలు చేరడం ఈ పదిరోజుల్లో పెద్ద విషయమేమీ కాదు అన్నట్టుగా ఉంది.

కాగా.. కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులతో దేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడ్డవారి సంఖ్య 2.10 కోట్లు దాటగా మరణాల సంఖ్య 2.30 లక్షలు దాటింది. గురువారం ఉదయం నాటికి దేశంలో 16.25 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాల ద్వారా తెలుస్తున్నది.


Next Story