చేపల కోసం పోతే.. చెరువు మింగేసింది

by  |
చేపల కోసం పోతే.. చెరువు మింగేసింది
X

దిశ, డోర్నకల్: స్నేహితులతో కలిసి సరదాగా చేపల పట్టేందుకు వెళ్లిన నలుగురు చిన్నారులను చెరువు మింగేసింది. వీరి మరణం నాలుగు కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శనిగపురం గ్రామ శివారు బోడతండాలో శనివారం సాయంత్రం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. బోడతండాకు చెందిన ఇస్లావత్ నందు లక్ష్మీల కొడుకు లోకేష్ (11) ఆరో తరగతి చదవుతున్నాడు. ఇస్లావత్ చందు, మంగమ్మల కొడుకు రాకేష్ (8) నాలుగో తరగతి.. బోడ హరి, లీల సంతానం జగన్ (8) నాలుగో తరగతి.. బోడ లాల్ సింగ్, జ్యోతి కొడుకు దినేష్ (9) ఐదో తరగతి అభ్యసిస్తున్నాడు. ఈ రోజు మధ్యాహ్నం తండాకు చెందిన నలుగురు స్నేహితులు, బంధువులతో కలిసి శనిగపురం గ్రామ సమీపంలోని తమ్మల్ చెరువులో చేపల పట్టేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే నలుగురు బాలురు సరదాగా ఈత కొట్టేందుకు చెరువులో దిగారు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి నలుగురు మృతి చెందారు. గమనించిన స్థానికులు చిన్నారులను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో చిన్నారుల మృతదేహాను వెలికి తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను మహబూబాబాద్ జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. ఒకే తండాకు చెందిన నలుగురు పిల్లలు మృతి చెందడంతో తల్లిదండ్రులు, స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Next Story

Most Viewed