33 మంది ‘సిట్టింగ్‌’లకు దక్కని అవకాశం.. కేరళలో సీపీఎం అభ్యర్థుల జాబితా

by  |
33 మంది ‘సిట్టింగ్‌’లకు దక్కని అవకాశం.. కేరళలో సీపీఎం అభ్యర్థుల జాబితా
X

తిరువనంతపురం : పార్టీని విజయతీరాలకు చేర్చిన ఎమ్మెల్యేలకు సాధారణంగా మళ్లీ టికెట్ ఇస్తుంటారు. కానీ, కొత్తవాళ్లకు అవకాశమివ్వాలనే ఆలోచనతో కేరళలోని సీపీఎం పార్టీ విభిన్న పంథాను అనుసరిస్తున్నది. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సిట్టింగ్‌లకు బదులు వారికి ప్రత్యామ్నాయంగా కనిపించే అభ్యర్థులకు టికెట్ ఇవ్వాలని సీపీఎం పార్టీ నిర్ణయించుకుంది. కొన్ని కారణాలతో ఈ నిబంధనలో మినహాయింపులూ ఉన్నాయి. కానీ, పై నిబంధన కారణంగా ఈ సారి 33 మంది సిట్టింగ్‌లు మళ్లీ పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు. ఇందులో ఐదుగురు రాష్ట్ర మంత్రులూ ఉండటం గమనార్హం. సీపీఎం బుధవారం 83 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. రాష్ట్ర సీపీఎం కార్యదర్శి ఏ విజయరాఘవన్ తిరువనంతపురంలో ఈ జాబితాను విడుదల చేశారు.

ఈ జాబితా ప్రకారం సీఎం పినరయి విజయన్ కన్నూర్ జిల్లాలలోని ధర్మదాం నుంచి బరిలోకి దిగుతారు. మట్టన్నూర్ నుంచి ఆరోగ్య మంత్రి కేకే శైలజా, కుందార నుంచి మత్స్య శాఖ మంత్రి జే మెర్సీకుట్టీ అమ్మ, పెరంబరా నుంచి టీపీ రామకృష్ణన్, తవనూర్ నుంచి ఉన్నత విద్యా శాఖ మంత్రి కేటీ జలీల్‌లు పోటీ చేయనున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అపజయం పాలైన సీనియర్ లీడర్లు ఎంబీ రాజేశ్, పీ రాజీవ్, వీఎన్ వాసవన్, కేఎన్ బాలగోపాల్‌లకూ ఈ ఎన్నికల్లో పార్టీ ఛాన్స్ ఇచ్చింది. ఈ జాబితాలో మొత్తం 12 మంది మహిళా అభ్యర్థులున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు వీణా జార్జ్, అడ్వకేట్ యూ ప్రతిభలు పార్టీ అవకాశమిచ్చింది. కాగా, ప్రముఖ నేతలు, ఆర్థిక శాఖ మంత్రి టీఎం థామస్ ఇసాక్, పీడబ్ల్యూడీ మంత్రి జీ సుధాకరణ్, విద్యా శాఖ మంత్రి ప్రొఫెసర్ జీ రవీంద్రనాథ్, సాంస్కృతిక శాఖ మంత్రి ఏకే బాలన్, పరిశ్రమల మంత్రి ఈపీ జయరాజన్‌లు ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.



Next Story