న‌గ‌ర శివారుల్లో 300 కిలోమీట‌ర్ల కొత్త సీసీ రోడ్లు

by  |
న‌గ‌ర శివారుల్లో 300 కిలోమీట‌ర్ల కొత్త సీసీ రోడ్లు
X

దిశ, న్యూస్‌బ్యూరో: న‌గ‌ర‌ శివారు ప్రాంతాల్లో రూ. 170 కోట్ల‌తో 300 కిలోమీట‌ర్ల పొడ‌వున కొత్త సీసీ రోడ్లు మంజూరు చేసిన‌ట్లు మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ వ్యాఖ్యానించారు. జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌లో ప్రాజెక్ట్స్‌, మెయింట‌నెన్స్ ఇంజ‌నీరింగ్ అధికారులు, సి.ఆర్‌.ఎం.పి ఏజెన్సీల‌తో సోమ‌వారం నిర్వ‌హించిన‌ స‌మ‌న్వ‌య స‌మావేశంలో ఆయన మాట్లాడారు. భ‌విష్య‌త్‌లో కొత్త పైప్‌లైన్లు, కేబుల్స్ ఇత‌ర ప‌నులు చేప‌ట్టేందుకు అనువుగా సీసీ రోడ్ల‌ను నిర్మించాల‌ని ఈ సందర్భంగా మేయర్ అధికారుల‌కు స్ప‌ష్టం చేశారు. ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ రోడ్ల‌ను త‌వ్వి గుంత‌లు చేయ‌డం వ‌ల‌్ల ప్ర‌భుత్వ సంక‌ల్పం దెబ్బ‌తింటున్న‌ద‌ని వాపోయారు. సీఆర్‌ఎంపీ కింద అప్ప‌గించిన 709 కిలోమీట‌ర్ల రోడ్ల నిర్వ‌హ‌ణ బాధ్య‌త పూర్తిగా ఆయా ఏజెన్సీల‌దేన‌న్నారు. ఏజెన్సీల‌కు అప్ప‌గించిన రోడ్ల క‌ట్టింగ్ చేసే అధికారం ఇతర శాఖలకు లేద‌న్నారు. గ‌తంలో కొన్ని శాఖ‌లు రోడ్ల క‌ట్టింగ్‌కు ఇచ్చిన అనుమ‌తుల కాల‌ప‌రిమితి మే 15తో ముగిసిన‌ట్లు తెలిపారు. వ‌ర్షాలు ప‌డుతున్నందున సీఆర్‌ఎంపీ ప‌రిధిలో దెబ్బ‌తిన్న రోడ్ల‌ను 24 గంట‌ల‌లో పున‌రుద్ధరించాల‌ని సూచించారు. ప్రాజెక్ట్స్‌ విభాగంలో చేప‌ట్టిన ప‌నుల్లో పెండింగ్ పునాదులు, పిల్ల‌ర్ల‌ను వారంలో పూర్తిచేసి వాహ‌నాల రాక‌పోక‌ల‌కు వెసులుబాటు క‌ల్పించాల‌ని తెలిపారు. హైద‌రాబాద్ ప్ర‌తిష్ట‌ను ఇనుమ‌డింప‌జేసేవిధంగా స్పెష‌ల్ శానిటేష‌న్ డ్రైవ్‌లో పారిశుధ్య విభాగంతో పాటు ఇంజ‌నీరింగ్‌, వాట‌ర్ వ‌ర్క్స్‌, ట్రాఫిక్‌, బ‌యోడైవ‌ర్సిటీ విభాగాలు కూడా పాల్గొనాల‌ని కోరారు. ఇంజ‌నీరింగ్ అధికారులు త‌మ ప‌రిధిలో ఉన్న రోడ్ల‌పై దెబ్బ‌తిన్న ఫుట్‌పాత్‌లు, సెంట్ర‌ల్ మీడియంల‌ను స‌రిచేయించాల‌ని తెలిపారు. ఈ స‌మావేశంలో సీఈ జియాఉద్దీన్‌, ఇంజ‌నీరింగ్ విభాగాల సూప‌రింటెండెంట్ ఇంజ‌నీర్లు, డిప్యూటి ఎగ్జిక్యూటివ్‌ ఇంజ‌నీర్లు, సి.ఆర్‌.ఎం.పి ఏజెన్సీలు పాల్గొన్నాయి.

Next Story