సరిహద్దులో 20 మంది సైనికుల మృతి

by  |
సరిహద్దులో 20 మంది సైనికుల మృతి
X

న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దులో 20 మంది సైనికులు మృతి చెందారు. లడాఖ్ లోని గాల్వాన్ లోయలో సోమవారం రాత్రి హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకోవడంతో ఇరు దేశాల సైనికులు చనిపోయారు. మన దేశానికి చెందిన ఆర్మీ అధికారితోపాటు 19 మంది జవాన్లు అమరులయ్యారు. కాగా, చైనా వైపునా 43 మంది తీవ్రంగా గాయపడటం లేదా చనిపోవడం జరిగిందని సమాచారం. గాల్వాన్ లోయలో ఏర్పడ్డ ఉద్రిక్తతలను పరిష్కరించేందుకు ఇరు దేశాలకు చెందిన డివిజన్ స్థాయి కమాండర్లు సమావేశమయ్యారు. భారత సైనికుల రెండుమార్లు సరిహద్దు దాటి లోపలికి చొచ్చుకు వచ్చి రెచ్చగొట్టేలా వ్యవహరించారని చైనా ఆరోపించింది. భారత్ దాని ఖండించింది. చైనా సైనికులే దుందుడుకు చర్యలకు పాల్పడ్డారని భారత్ పేర్కొంది. ఈ ఘర్షణల్లో ఓ అధికారి సహా ఇద్దరు జవాన్లు మృతి చెందారని మంగళ మధ్యాహ్నానికి ఆర్మీ వెల్లడించింది. కానీ, మంగళవారం రాత్రి ఆ ప్రకటనను సవరించింది. ఘర్షణల్లో ముగ్గురితోపాటు మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారని, ఎముకలు కొరికే చలికి ఆ 17 మంది తిరిగి కోలుకోలేక పోయారని, వారు కూడా చనిపోయినట్టు మంగళవారం రాత్రి వెల్లడించింది.

ఈ ఘటనపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్, విదేశాంగ మంత్రి జయశంకర్ లతో సమావేశం అయ్యారు. అనంతరం ఘర్షణ వివరాలను ప్రధాని మోడీకి వివరించారు. మంగళవారం రాత్రి ప్రధాని మోడీ.. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా లతో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులను పర్యవేక్షించారు.

సంయమనం పాటించండి: ఐరాస

భారత్-చైనా సరిహద్దుల్లో ఏర్పడ్డ హింసాత్మక ఘర్షణలను పరిశీలిస్తున్నామని ఐరాస వెల్లడించింది. ఇరుదేశాలు సంయమనం పాటించాలని ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్ సూచించారు. అయితే ఇరు దేశాలు వెనక్కి తగ్గాలని తీసుకొన్న నిర్ణయాన్ని పరిగణిస్తున్నామని గుటెరస్ అధికార ప్రతినిధి ఎరి కనెకో తెలిపారు.



Next Story

Most Viewed