ర్యాగింగ్‌కు తప్పదు భారీ మూల్యం.. సీనియర్లపై రూ. 54 వేల ఫైన్.. ఎక్కడంటే..

by  |
ragging
X

దిశ, వెబ్‌డెస్క్: కాలేజీలలో జూనియర్ విద్యార్థులపై ర్యాగింగులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని యాజమాన్యాలు చెబుతున్నా కొందరు ఆకతాయి విద్యార్థులకు చెవికెక్కడం లేదు. ఒడిషాలోని ఒక మెడికల్ కాలేజీలో సీనియర్లు తమను ర్యాగింగ్ చేస్తున్నారని జూనియర్లు ఫిర్యాదు చేయడంతో.. ఆ విద్యార్థులపై రూ. 54 వేల జరిమానా విధించింది సదరు కాలేజీ యాజమాన్యం. అసలేం జరిగిందంటే…

ఒడిషాలోని సంబాల్‌పూర్ జిల్లా బుర్లాలో ఉన్న వీర్ సురేంద్ర సాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (VIMSAR) కాలేజీలో చోటు చేసుకుంది ఈ ఘటన. ఈ నెల 10న కాలేజీలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న పలువురు విద్యార్థులు.. రెండో సంవత్సరం అభ్యసిస్తున్న స్టూడెంట్స్‌ను బాస్కెట్ బాల్ గ్రౌండ్ లోకి రావాలని ఆదేశించారు. కానీ జూనియర్ విద్యార్థులెవరూ అక్కడికి వెళ్లలేదు. దీంతో అదే రాత్రి జూనియర్లుండే హాస్టల్‌కు వెళ్లిన సీనియర్లు.. తమ మాట ధిక్కరించినందుకు గాను రాత్రి 11 గంటల నుంచి ఉదయం నాలుగు గంటల దాకా వారిని గ్రౌండ్‌లో నిల్చోబెట్టారు. అంతేగాక వారిని బూతులు తిడుతూ.. వేధింపులకు గురి చేశారు.

ఈ ఘటనపై పలువురు జూనియర్ విద్యార్థులు ఢిల్లీలోని యాంటీ ర్యాగింగ్ సెల్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన కాలేజీ యాజమాన్యం.. విచారణ జరిపించి ర్యాగింగ్‌కు పాల్పడిన 18 మంది విద్యార్థులను గుర్తించింది. వారిపై రూ. 54 వేల జరిమానా విధించింది. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి పనులు చేయమని బాండ్ రాయించింది.


Next Story

Most Viewed