48 గంటలు తల్లి శవంతో 18 నెలల చిన్నారి.. ఆకలికి తట్టుకోలేక..

by  |
Women Constable
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా మానవత్వాన్ని చంపేస్తోంది. కళ్ల ముందు ప్రాణాలు పోతున్నా కాపాడిల్సిన జనమే కళ్లప్పగించి చూస్తున్నారు. చావు ఏదైనా కరోనాకే ముడిపెడుతున్నారు. పండు ముదుసలి నుంచి పసి హృదయం వరకు బాధతో తల్లడిల్లుతున్నా.. మర బొమ్మల్లా మరణాలను చూస్తున్నారు. తాజాగా పూణెలో హృదయవిదార ఘటన జరిగింది. 18 నెలల బిడ్డతో ఒంటరిగి ఉన్న మహిళ హఠాత్తుగా మృతి చెందింది. అది తెలియని ఆ చిన్నారి రెండు రోజులుగా గుక్కెడు తల్లి పాల కోసం గుక్కపట్టి ఏడ్చినా.. స్థానికులు సినిమాలా చూశారే తప్పా.. ఆ పాప ఆకలి తీర్చలేకపోయారు.

మహారాష్ట్ర, పూణెలోని ఓ కాలనీలో భార్యభర్తలు ఉంటున్నారు. భర్త ఇటీవల ఉత్తరప్రదేశ్ వెళ్లాడు. 18 నెలల బిడ్డతో ఒంటరిగా ఉంటున్న ఆ ఇల్లాలు శనివారం మృతిచెందింది. అది గమనించిన స్థానికులు ఆమె కరోనాతోనే ప్రాణాలు విడిచిందని భావించారు. ఆమె దగ్గరకు వెళ్లడానికి సహసించలేదు. తల్లి శవం పక్కనే పడుకున్న చిన్నారి ఆకలితో తల్లిని లేపడానికి ప్రయత్నించింది. అయినా ఆమె స్పందించకపోవడంతో ఆ పసికూన గుక్కపట్టి ఏడ్చింది. అలా రెండు రోజులు ఏడ్చినా స్థానికుల హృదయాలు కరగలేదు.

ఆ చిన్నారి ఏడ్చీఏడ్చి తల్లి శవం పక్కనే పడిపోయింది. ఆ చిన్నారి బాధను చూడలేక ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి చిన్నారిని అక్కున చేర్చుకున్నారు. మహిళా కానిస్టేబుళ్లు ఆ పాపకు పాలు తాగించారు. ఆకలితో ఉన్న బిడ్డ.. కడుపు నిండా పాలు తాగింది. బిస్కెట్లను తిని కానిస్టేబుల్ ఒడిలో సేదరింది. మహిళా కానిస్టేబుల్‌ సుశీల గభాలే మాట్లాడుతూ.. చిన్నారికి రెండు రోజులుగా ఆహారం లేక బాగా నీరసించి పోయిందని, జ్వరం కూడా వచ్చిందని తెలిపింది. కరోనా పరీక్షల కోసం పాపను ఆస్పత్రికి తరలించారు. తల్లి శవాన్ని కూడా పోస్ట్ మార్డం కోసం మార్చురీకి తరలించారు. అయితే ఆమె కరోనాతో చనిపోయిందా.. మరేదన్న కారణం ఉన్నదా అని పోలీసులు ఎంక్వేరీ చేస్తున్నారు. భర్తకు సమాచారం ఇచ్చిన పోలీసులు అతడి రాకకోసం ఎదురు చూస్తున్నారు.

Next Story

Most Viewed