యాదాద్రి జిల్లాకు 1700 ర్యాపిడ్ కిట్లు

by  |
యాదాద్రి జిల్లాకు 1700 ర్యాపిడ్ కిట్లు
X

దిశ, నల్లగొండ: కరోనా నిర్ధారణ పరీక్షలు వేగంగా నిర్వహించే ర్యాపిడ్​ కిట్లు యాదాద్రి జిల్లాకు చేరుకున్నాయని జిల్లా వైద్యాధికారి సాంబశివ రావు వెల్లడించారు. వాటిని ప్రస్తుతం జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో భద్రపరిచామని ఆయన అన్నారు. ఒకట్రెండు రోజుల్లో ర్యాపిడ్ కిట్ల ద్వారా కరోనా లక్షణాలు ఉన్న వారికి జిల్లాలోనే పరీక్షలు చేయనున్నామని, అర గంటలోనే ఫలితం రానున్నదని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో ప్రస్తుతం కరోనా పాజిటివ్​ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, వారం రోజులుగా పాజిటివ్​ కేసుల సంఖ్య రెండంకెలకు చేరుకుంటోందన్నారు. ప్రస్తుతం ర్యాపిడ్​ కిట్ల రాకతో కరోనా వ్యాధి నిర్ధారణ జిల్లాలో త్వరతగతిన గుర్తించడం వీలుకానుందని స్పష్టం చేశారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారి సాంపిల్స్ తీసుకున్న అరగంటలో ఫలితం రానున్నట్టు వైద్యాధికారి సాంబశివరావు తెలిపారు. దీంతో సత్వరం కరోనా పాజిటివ్​ రోగులను గుర్తించడానికి, వారికి చికిత్స అందించడానికి వీలవుతోంది. గతంలో బీబీనగర్​ ఎయిమ్స్​లో రోగుల నుంచి సాంపిల్స్​ సేకరించి కరోనా పరీక్షల కోసం హైదరాబాద్​ పంపేవారు. వాటి ఫలితం రావడానికి కనీసం 48 గంటల సమయం తీసుకునేవారు. ర్యాపిడ్​ కిట్ల రాకతో ఆ ఇబ్బందులు తప్పనున్నాయని అన్నారు. ప్రస్తుతం బీబీనగర్​ ఎయిమ్స్​లో క్వారంటైన్​లో ర్యాపిడ్​ టెస్టులు చేయనున్నారు. కలెక్టర్​ అనుమతి తీసుకుని చౌటుప్పల్​, మోత్కూర్​ కేంద్రాల్లో కూడా టెస్టులు ప్రారంభించాలని వైద్యాధికారులు యోచిస్తున్నారు. జిల్లాలోని పీహెచ్​సీల్లో కూడా కిట్​లను అందుబాటులో ఉంచి నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నాయని వైద్య అధికారులు చెబుతున్నారు.



Next Story