కరోనాను జయించిన ఉమ్మడి కుటుంబం

by  |
కరోనాను జయించిన ఉమ్మడి కుటుంబం
X

న్యూఢిల్లీ: ఢిల్లీలో నివసిస్తున్న జాయింట్ ఫ్యామిలీ కరోనాను కలిసి జయించింది. మూడు నెలల నుంచి 90 ఏళ్ల వయసున్న ఈ కుటుంబ సభ్యులంతా ఒకే ఇంట్లో లాక్‌డౌన్ కాలంలో ఆడుతూ పాడుతూ గడిపారు. 17 మంది సభ్యులున్న ఆ కుటుంబంలో 11 మందికి కరోనా వచ్చినా పైచేయి సాధించారు. పాజిటివ్ అని తేలగానే వారంతా వేర్వేరు గదుల్లో ఐసొలేషన్‌ను అనుసరించారు. ఒక్కరికి తీవ్ర శ్వాస సమస్య తలెత్తడంతో హాస్పిటల్‌లో కోలుకున్నప్పటికీ మిగతా వారంతా ఇంటికాడే వైరస్‌ను జయించారు.

ఈ విజయగాథ ఢిల్లీలో నివసిస్తున్న ముకుల్ గార్గ్ కుటుంబానిది. సాధారణ కాలంలో ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండేవారు. కానీ, లాక్‌డౌన్‌తో అందరూ ఒకేచోట కలిసి ఉండటంతోపాటు కలిసి తినడం, ఆడుకోవడం, కాలక్షేపం చేయడం సాగింది. కరోనాపై అప్రమత్తంగా ఉండి సరుకులకు మార్చిమార్చి ఒక్కరే వెళ్లేవారు. తొలిగా ఒక్కరికి సోకిన ఆ వైరస్ అందరికీ అంటుకొచ్చింది. ఇందులో మంచానికి పరిమితమైన 90ఏళ్ల ముసలాయన, 87ఏళ్ల వృద్ధురాలు, 60, 62ఏళ్ల డయాబెటిస్, బీపీ పేషెంట్లూ ఉన్నారు. ఇక్కడే మహమ్మారి ఊసరవెల్లితనం బయటపడింది. అందులో అనిత అనే మధ్యవయస్కురాలికే తీవ్ర అనారోగ్య సమస్యలు రాగా, కొందరిలో అసలు లక్షణాలే కనిపించలేదు. ఎట్టకేలకు అందరికీ జూన్‌ తొలినాళ్లలో కరోనా నెగెటివ్ అని రావడంతో మళ్లీ ఒకేచోట తినడం, ఆడుకోవడం, కాలక్షేపం చేయడం ప్రారంభమయ్యాయని ముకుల్ ఓ బ్లాగ్‌లో తెలిపారు.

Next Story

Most Viewed