నితీశ్ టీంలోకి కొత్తగా 17 మంది మంత్రులు

by  |
నితీశ్ టీంలోకి కొత్తగా 17 మంది మంత్రులు
X

పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ మంగళవారం క్యాబినెట్ విస్తరణ చేపట్టారు. కొత్తగా 17 మంది మంత్రులను మంత్రివర్గంలోకి చేర్చుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ప్రతినిధి సయ్యద్ షానవాజ్ హుస్సేన్‌కు చోటుకల్పించారు. ఆయనకు పరిశ్రమల శాఖను కేటాయించారు. కొత్తగా చేర్చుకున్న 17 మందిలో తొమ్మిది మంది బీజేపీ ఎమ్మెల్యేలను, ఎనిమిది మంది జేడీయూ ఎమ్మెల్యేలకు అవకాశమిచ్చారు. దీంతో మొత్తంగా బీహార్ మంత్రివర్గంలో సీఎంతో కలుపుకుని 31 మంది సభ్యులున్నారు. సంఖ్యా రీతిలో బీజేపీ సభ్యులు అధికంగా ఉన్నప్పటికీ ప్రాధాన్య శాఖలు మాత్రం జేడీయూ సభ్యుల చేతిలోనే ఉన్నాయి. హోం, గ్రామీణాభివృద్ధి, రూరల్ వర్క్స్, నీటి వనరులు, విద్యా, సిబ్బంది లాంటి కీలక శాఖలు జేడీయూ మంత్రులకే కేటాయించారు. కొత్త చేర్పులతో బీజేపీ మంత్రుల సంఖ్య 16కు పెరిగింది. వీరికి 22 పోర్టు ఫోలియోలున్నాయి.

జేడీయూ మంత్రులు 13 మంది ఉండగా, వీరి చేతుల్లో 21 పోర్టుఫోలియోలున్నాయి. కాగా, మిత్రపక్షాలు హిందుస్తానీ ఆవామ్ మోర్చా, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీలకు తల ఒక మంత్రి పదవి గతంలోనే కేటాయించిన సంగతి తెలిసిందే. కొత్త చేర్పుల్లో పెద్దపేరుగా చూస్తున్న సయ్యద్ షానవాజ్ హుస్సేన్‌కు రాష్ట్రంలో ప్రాధాన్యత లేని పరిశ్రమల శాఖను కేటాయించారని, డిప్యూటీ సీఎం రేణు దేవికి విపత్తు నిర్వహణ బాధ్యతలు అప్పగించారని విశ్లేషకులు వివరించారు. బీహార్ ఎన్‌డీఏలో పెద్దన్నపాత్ర పోషించిన జేడీయూ గత ఎన్నికల్లో (71 నుంచి43 స్థానాలకు పడిపోయింది)డీలా పడింది. బీజేపీ(74 సీట్లు గెలుచుకుంది) నాయకత్వ స్థానానికి చేరింది. కాగా, క్యాబినెట్ విస్తరణలో జేడీయూ తనదే పైచేయి ఉండేలా జాగ్రత్త తీసుకున్నట్టు తెలుస్తున్నది.



Next Story

Most Viewed