ఆర్థిక సంక్షోభం.. కాళేశ్వరం గుదిబండే..?

by  |
ఆర్థిక సంక్షోభం.. కాళేశ్వరం గుదిబండే..?
X
తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణపై 15వ ఆర్థిక సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. పాత అప్పులను తీర్చడంలో ఉన్న ఇబ్బందులకు తోడు కొత్త అప్పులు చేయాల్సి రావడాన్ని గుర్తుచేసింది. పకడ్బందీగా వ్యవహరించకపోతే ‘కుదుపు’ తప్పదని హెచ్చరించింది. రానున్న నాలుగేళ్ల కాలానికి 15వ ఆర్థిక సంఘం రూపొందించిన నివేదికలో అనేక అంశాలను ప్రస్తావించింది. సాగునీటిపై యూజర్ చార్జీలను విధించి కనీసం ప్రాజెక్టు మెయింటెనెన్స్ కు సరిపోయేంత రెవెన్యూను ఆర్జించడం ఉత్తమం అని సలహా ఇచ్చింది.

దిశ, తెలంగాణ బ్యూరో : గతంలో ‘కాగ్’ లేవనెత్తిన అంశాలపై సైతం 15వ ఆర్థిక సంఘం వ్యాఖ్యానించింది. గోదావరి నదిపై సుమారు రూ. 80 వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణకు భారీ స్థాయిలో విద్యుత్ బిల్లుల్ని చెల్లించాల్సి ఉంటుందన్న ‘కాగ్’ సూచనను గుర్తుచేసింది. రాష్ట్రానికి వచ్చే స్వీయ ఆర్థిక వనరులలో కొన్నింటి నుంచి తక్కువ వసూళ్లే జరుగుతున్నాయని 15వ ఆర్థిక సంఘం వివరించింది. మహారాష్ట్రలో రిజిస్ట్రేషన్లు-స్టాంపు డ్యూటీ ద్వారా సుమారు 15% మేర సమకూరుతుండగా తెలంగాణలో మాత్రం అందులో సగం మాత్రమే ఉందని పేర్కొంది. దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచించింది. ఎఫ్ఆర్‌బీఎం ప్రకారం తీసుకుంటున్న రుణాలే కాకుండా బడ్జెట్‌తో సంబంధం లేకుండా వివిధ కార్పొరేషన్ల పేరుమీద తీసుకుంటున్న అప్పులను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని నొక్కిచెప్పింది. రానున్న కాలంలో ఆర్థికపరంగా ‘కుదుపు’లను నివారించుకోవాలంటే ఈ దిశగా ఆలోచించాలని స్పష్టం చేసింది.

పెరుగుతున్న ఖర్చులు

ఏటేటా పెరుగుతున్న సంక్షేమ ఖర్చులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా ఉనికిలోకి వచ్చిన సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం గణనీయంగా పెరిగిపోయిందని, ఒక్కో మనిషిమీద 2015-16లో ఈ అవసరాల కోసం సగటున రూ. 20,438 ఖర్చు పెడితే 2018-19 నాటికి రూ. 25,375కు పెరిగిందని గుర్తు చేసింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జీఎస్‌డీపీలో 11.3% మేర మాత్రమే రెవెన్యూ ఖర్చులు ఉంటే 2020-21 నాటికి అది 12.5%కి చేరుకుందని వివరించింది. అదేసమయంలో రాష్ట్రానికి సంపద చేకూర్చే కాపిటల్ ఎక్స్‌పెండిచర్ మాత్రం 2015-16లో 5.6% (రాష్ట్ర జీఎస్‌డీపీలో) ఉంటే 2020-21 నాటికి అది 3.4%కి తగ్గిపోయింది. 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ‘ఆసరా’ పింఛన్లు, ‘కల్యాణలక్ష్మి’ లాంటి పథకాలకు ఆర్థిక సాయాన్ని రెట్టింపు చేయడం, ‘రైతుబంధు’ లాంటి పథకాలకు ఎకరానికి సీజన్‌కు వెయ్యి రూపాయల చొప్పున పెంచడం, ‘రైతుబీమా’ ఖర్చు కూడా దాదాపు రెట్టింపు కావడంతో రెవిన్యూ ఖర్చులు మరింతగా పెరిగాయి. వీటిని ఆర్థిక సంఘం ప్రస్తావించకపోయినా ఆర్థిక నిర్వహణ మరింత పటిష్టమైన తీరులో జరగాలని మాత్రం నొక్కిచెప్పింది.

అప్పులు సగం వడ్డీలకే

తెలంగాణ రాష్ట్రం తీసుకుంటున్న అప్పులు ఎఫ్ఆర్‌బీఎం పరిధికి లోబడి ఉన్నప్పటికీ, మిగులు బడ్జెట్ రాష్ట్రంగా కొనసాగుతున్నప్పటికీ, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో స్థానం సంపాదించుకున్నప్పటికీ రుణాలు, వివిధ ప్రాజెక్టు అవసరాల నిమిత్తం బడ్జెట్‌తో సంబంధం లేకుండా అప్పులు తీసుకుంటున్నప్పటికీ గతంలో చేసిన అప్పులపై రాష్ట్ర జీఎస్‌డీపీలో 1.3% మేర కేవలం వడ్డీల రూపంలోనే చెల్లించాల్సి వస్తోందని ఆర్థిక సంఘం తాజా రిపోర్టులో నొక్కిచెప్పింది. మొత్తం అప్పులు మూడు శాతం ఉన్నప్పటికీ పాత అప్పులు కూడా ఇంకా కట్టాల్సిన స్థాయిలో ఉన్నందున వాటిపై అప్పుల కోసం మొత్తం అప్పుల్లో సగం వడ్డీల కోసమే చెల్లించాల్సి వస్తోందని నొక్కిచెప్పింది. వివిధ రకాల ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలు తదితరాల కోసం చేసే కాపిటల్ ఎక్స్‌పెండిచర్ దాదాపుగా రుణాలతోనే నడుస్తున్నట్లు ‘కాగ్’ లెక్కలు, 15వ ఆర్థిక సంఘం నివేదిక తెలియజేస్తున్నాయి. ఎఫ్ఆర్‌బీఎం ద్వారా తీసుకుంటున్న అప్పులు జీఎస్‌డీపీలో మూడు శాతం ఉంటుండగా, ప్రతీ ఏటా కాపిటల్ ఎక్స్‌పెండించర్ కోసం చేస్తున్న ఖర్చులు 3.4%గా ఉన్నాయి. ఈ అప్పులే చేయకపోతే కాపిటల్ ఖర్చులు చేయడం సాధ్యమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండింటినీ పోలిస్తే దాదాపుగా అటూయిటుగా సమంగా ఉండడంతో ఒకదానితో మరోదాని అవసరాలు తీరుతున్నట్లు స్పష్టమవుతోంది.



Next Story

Most Viewed