ఎన్నికల వేళ బీఎస్‌పీకి షాక్.. 11 మంది ఎమ్మెల్యేలు ఎస్‌పీలోకి?

by  |
ఎన్నికల వేళ బీఎస్‌పీకి షాక్.. 11 మంది ఎమ్మెల్యేలు ఎస్‌పీలోకి?
X

లక్నో: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బీఎస్‌పీ పార్టీ నుంచి సస్పెండ్ అయిన 11 ఎమ్మెల్యేలు సమాజ్‌వాదీ పార్టీ కండువా కప్పుకోనున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎస్‌పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌తో రెబల్ ఎమ్మెల్యేల భేటీ ఈ వాదనలకు ప్రాధాన్యతనిస్తున్నది. అఖిలేశ్‌తో సమావేశమైన సస్పెండ్ అయిన బీఎస్‌పీ ఎమ్మెల్యే అస్లాం రైనీ మాట్లాడుతూ, బీఎస్‌పీ యాక్షన్ తీసుకున్న ఎమ్మెల్యేల సంఖ్య 11కు చేరిందని, మరొకరు కలిస్తే సొంతంగా పార్టీ స్థాపించే యోచన చేస్తున్నట్టు తెలిపారు. సస్పెన్షన్ వేటుకు గురైన మరో బీఎస్‌పీ ఎమ్మెల్యే లాల్జీ వర్మ సారథ్యంలోనే తాము నడుస్తామని, ఆయన ఎస్‌పీలో చేరమంటే చేరుతామని, లేదంటే కొత్త పార్టీ పెట్టడానికీ వెనుకాడమని వివరించారు.

గత నెల శాసనసభా పక్షనేత లాల్జీ వర్మ సహా మరొకరిని బీఎస్‌పీ చీఫ్ మాయావతి పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో సస్పెన్షన్ వేటుకు గురైన మొత్తం బీఎస్‌పీ ఎమ్మెల్యే సంఖ్య 11కు చేరింది. అఖిలేశ్ యాదవ్‌తో భేటీ కావడంతో తాము ఎస్‌పీలో చేరబోతున్నామని వార్తలు వచ్చాయని, లాల్జీ వర్మ అదే నిర్ణయిస్తే సమాజ్‌వాదీ పార్టీలో చేరుతామని రైనీ స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్‌పీ, బీఎస్‌పీ కలిసి పోటీ చేసి ఘోర పరాభవాన్ని చవిచూశాయి. తర్వాత ఈ రెండు పార్టీల మధ్య పొత్తు బెడిసికొట్టింది. ప్రస్తుతం బీఎస్‌పీలో కేవలం ఏడుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.



Next Story

Most Viewed