100వ రోజుకి రైతుల ఉద్యమం

by  |
100వ రోజుకి రైతుల ఉద్యమం
X

దిశ వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో దేశ రైతులు చేస్తున్న ఉద్యమం నేటికి 100వ రోజుకి చేరుకుంది. ఉద్యమాన్ని విరమించాలని రైతులతో కేంద్ర ప్రభుత్వం పలుమార్లు చర్చలు జరిపినా.. అవి సఫలం కాలేదు. దీంతో రైతులు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఎండ, చలి, వానను కూడా లెక్కచేయకుండా రోడ్లపై కూర్చోని ఆందోళనలు చేపడుతూనే ఉన్నారు. దీంతో రైతుల ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ప్రతిపక్ష పార్టీలతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు రైతులు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.

అంతర్జాతీయంగా కూడా ఈ ఉద్యమం ప్రభావం చూపగా.. ఇతర దేశాలకు చెందిన పలువురు సినీ సెలబ్రెటీలు రైతుల ఉద్యమంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇక గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకొటపై రైతులు జెండాను ఎగురువేయడం, వేల ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించడం లాంటి ఘటనలతో ఉద్యమం తీవ్రరూపం దాల్చింది.

నేటికి ఉద్యమం 100వ రోజుకి చేరుకున్న క్రమంలో ఇవాళ బ్లాక్ డే పాటిస్తామని రైతు సంఘాల నాయకులు తెలిపారు. 5 గంటల పాటు ఢిల్లీలోని కుండ్లీ మనేసర్ పల్‌వాల్ ఎక్స్‌ప్రెస్ హైవేను దిగ్భంధిస్తామన్నారు. తమ ఉద్యమానికి మద్దతుగా ఇళ్లు, కార్యాలయాల దగ్గర నల్ల జెండాలు ఎగురవేయాలని దేశ ప్రజలకు రైతు సంఘాల నాయకులు సూచించారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించేవరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు.


Next Story

Most Viewed