నిజామాబాద్‌లో దొంగల బీభత్సం

by  |
నిజామాబాద్‌లో దొంగల బీభత్సం
X

దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో దొంగలు రెచ్చిపోయారు. బాసర ప్రధాన రహదారి పక్కన గల అయ్యప్ప స్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇద్దరు దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆలయ సంరక్షకుడు ధర్మపురి ఉండే గదికి బయట నుంచి గడియ పెట్టి దొంగతనం చేశారు. ఆలయంలో గల 100కేజీల హుండీతో పాటు స్వామీ వారి మీద ఉన్న 9కిలోల పంచ లోహ ఆభరణాన్ని ఎత్తుకెళ్ళారు. అంతేకాకుండా ఆలయ ప్రాంగణంలోని 7సీసీ కెమెరాలను డామెజ్ చేశారు. హుండీని చుట్టుపక్కల గల పొలాల్లొకి తీసుకెళ్లి పగుల గొట్టి అందులోని నగదును ఎత్తుకెళ్లారు. అయితే, అర్థరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ధర్మపురి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా తలుపు రాలేదు. అనుమానం వచ్చిన ఆయన ఆలయ కమిటీ సభ్యులు కాంతం, యన్.యన్.రెడ్డి, కిషన్ రావులకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చాడు. అక్కడకు చేరుకున్న ప్రధాన అర్చకులు శశాంక్ పంతులుతో కలిసి నవీపేట్ పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు పరిసర ప్రాంతాల్లో గాలించగా పగిలిన హుండీ పొలాల్లో దర్శనమిచ్చింది.

రాత్రుళ్లు పోలీసు పెట్రోలింగ్ సరిగా లేకపోవడం వల్లే చోరీ జరిగిందని ఆరోపణలు వెల్లువెల్లుతున్నాయి. మరో వైపు అయ్యప్ప స్వామి ఆలయాన్ని నవీపేట్ సర్పంచ్ శ్రీనివాస్ పరిశీలించారు. సీసీ ఫుటేజ్‌ని ఆలయ కమిటీ సభ్యులతో పాటు సర్పంచ్ కూడా పరిశీలించారు. నిందితులను వెంటనే పట్టుకుని చోరీకి గురైన ఆభరణంతో పాటు, హుండీ సొమ్మును స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఆలయ అర్చకులు శశాంక్ పంతులు మాట్లాడుతూ.. సీసీ ఫుటేజ్‌ను పరిశీలించి స్థానిక ఎస్‌ఐకు సమాచారం అందించామని, వీలైనంత త్వరగా నిందితులన పట్టుకుని ఆభరణాలను రికవరీ చేయాలన్నారు.



Next Story