తమిళనాడు నిర్ణయం..ఓ సూసైడ్ అటెంప్ట్

by  |
తమిళనాడు నిర్ణయం..ఓ సూసైడ్ అటెంప్ట్
X

దిశ, వెబ్‌డెస్క్ : సంక్రాంతి పండుగకు భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ నేపథ్యంలోనే థియేటర్లు, మల్టీప్లెక్సుల్లో సీటింగ్ సామర్థ్యాన్ని 100 శాతానికి పెంచుతూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కరోనా కేసుల సంఖ్య తగ్గడం, ఈ నెల 13 నుంచి దేశమంతటా కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేస్తుండటంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కానీ, వైద్యులంతా అలసిపోయున్న ఈ టైమ్‌లో ఇది కరెక్ట్ డెసిషన్ కాదంటూ ఓ వైద్యుడు.. ఫేస్‌బుక్ వేదికగా తమిళనాడు సర్కారుతో పాటు నటులు విజయ్, శింబుకు ఓపెన్ లెటర్ రాశాడు.

కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో వైద్యులంతా ఏడాది కాలంగా అవిశ్రాంతంగా సేవలందిస్తున్న విషయం తెలిసిందే. ఇక కరోనా కాస్త తగ్గుముఖం పడుతుండటంతో ఊపిరి పీల్చుకుంటున్న వైద్యులను ప్రస్తుతం కరోనా న్యూ స్ట్రెయిన్ కలవరపెడుతోంది. కొన్ని దేశాల్లో కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో.. బ్రిటన్, జర్మనీ, స్కాట్లాండ్, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, పోలండ్ దేశాలు మళ్లీ లాక్‌డౌన్ అమలు చేస్తుండగా, భారత్ మాత్రం ఇతర దేశాలతో పోల్చితే సేఫ్‌గానే ఉంది. కానీ ముప్పు మాత్రం పొంచి ఉందని వైద్యులతో పాటు, ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే థియేటర్లలో 100 శాతం సీటింగ్ ఆక్యుపెన్సీ నిర్ణయం వల్ల కొందరు మాత్రమే లాభపడతారని, కానీ దీనివల్ల ప్రజలంతా ఇబ్బందుల్లో పడతారని స్థానిక వైద్యుడు అరవింద్ శ్రీనివాస్ అంటున్నాడు. అంతేకాదు ఈ నిర్ణయాన్ని ఆయన ‘సూసైడ్ అటెంప్ట్’, ‘హోమిసైడ్’ (ఒకరి నిర్లక్ష్యంగా కారణంగా ఇతరులు ప్రాణాలు కోల్పోవడం)తో పోల్చాడు. మెడికోలందరూ కూడా అలసిపోయి ఉన్నారని, ఈ సమయంలో కొవిడ్ విజృంభిస్తే ముప్పు తప్పదంటూ హెచ్చరించాడు.

‘నేను అలసిపోయాను. నాలాంటి వేలాదిమంది వైద్యులు కూడా అలసిపోయారు. హెల్త్‌కేర్ వర్కర్స్, పోలీసులు, శానిటరీ ఉద్యోగులందరూ అవిశ్రాంతంగా పనిచేస్తూ టైర్డ్ అయిపోయారు. ఊహించని ముప్పు వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొవడానికి మేమంతా చాలా కష్టపడ్డాం. అందులో గొప్పతనం ఏమీ లేదు. మేమంతా హీరోలం కూడా కాదు. కానీ, ఊపిరి పీల్చుకోవడానికి మాకు కాస్త స్వేచ్ఛ కావాలి. కొంతమంది స్వార్థం, దురాశ వల్ల ఆ స్వేచ్ఛను హరించొద్దు. పాండమిక్ ఇంకా అయిపోలేదు. కొవిడ్ వల్ల ఇప్పటికీ మరణాలు సంభవిస్తున్నాయి. 100 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ అనేది సూసైడ్ అటెంప్ట్‌తో సమానం. ఇది ఒక కఠోర బార్టార్ వ్యవస్థ, డబ్బు కోసం జీవితాలతో వర్తకం చేస్తుండగా, సినిమాలు చూడటం కోసం సో కాల్డ్ హీరోలు తమకు తాముగా ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నారు. అందరూ గమనించండి. ఈ పేద, అలసిపోయిన డాక్టర్ విజ్ఞప్తిని మన్నించండి’ అని నటుడు విజయ్, శింబుతో పాటు తమిళనాడు ప్రభుత్వానికి రాసిన లేఖలో డాక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే.. తెలుగు రాష్ట్రాల్లోనూ 100 శాతం ఆక్యుపెన్సీకి తగిన అనుమతులివ్వాలని తెలుగు సినీ నిర్మాతల మండలి తరపున రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు వినతిపత్రం అందజేయడం గమనార్హం.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed