కరోనా కష్టాల్లో.. ఉద్యోగులకు అండగా కంపెనీలు!

by  |
కరోనా కష్టాల్లో.. ఉద్యోగులకు అండగా కంపెనీలు!
X

దిశ, ఫీచర్స్ : దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు ఎంత ఆందోళనకరంగా ఉన్నాయో తెలిసిందే. ఎంత జాగ్రత్తగా ఉన్నా, చిన్న పొరపాటు సైతం కొవిడ్ బారిన పడేందుకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో ఏవో కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పిస్తుండగా.. అత్యవసర సర్వీసుల్లో పనిచేస్తున్న వారితో పాటు చాలా వరకు ప్రైవేట్ ఉద్యోగులు ఆఫీస్‌లకు వెళ్లాల్సిన పరిస్థితి. ఈ మేరకు వైరస్‌ నుంచి తప్పించుకోవడం అసాధ్యంగా మారింది. అయితే రికవరీ రేటు బాగానే ఉన్నప్పటికీ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత, బెడ్లు దొరక్కపోవడం వంటి కారణాలతో కరోనా పేషెంట్లు తమ కళ్లముందే ప్రాణాలు కోల్పోతుండగా.. కుటుంబ సభ్యులు ఏం చేయలేక విలవిల్లాడుతున్నారు. ఈ క్రమంలోనే కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు సాయంచేసేందుకు ముందుకొచ్చాయి. కొవిడ్ హార్డ్ టైమ్స్‌లో తమ ఎంప్లాయీస్‌తో పాటు వారి కుటుంబ సభ్యులకు అండగా నిలిచేందుకు నిర్ణయం తీసుకున్నాయి.

రెండు సంవత్సరాల శాలరీ ప్రకటించిన బోరోసిల్..

కరోనా మహమ్మారి కారణంగా బోరోసిల్ లిమిటెడ్.. ఇప్పటికే నలుగురు ఉద్యోగులను కోల్పోయింది. ఈ క్రమంలో తమ ఉద్యోగులు ఎవరైనా కొవిడ్ వల్ల మరణిస్తే, వారి కుటుంబాలకు రెండు సంవత్సరాల శాలరీ అందించనున్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా బాధితుల పిల్లలకు ఇండియాలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేవరకు ఫీజులను చెల్లించనున్నట్టు వెల్లడించింది. అయితే చనిపోయిన వారి ప్రాణాలకు వెలకట్టడం మా ఉద్దేశం కాదని, కానీ బాధిత కుటుంబాలు తిరిగి నిలదొక్కుకునేందుకు ఈ సాయం ఎంతో కొంత సాయపడుతుందని బోరోసిల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీవర్ ఖేర్కులా తెలిపారు.

అమెజాన్..

తమ ఉద్యోగులకు పాజిటివ్ నిర్ధారణ అయితే లేదా ఫ్యామిలీలో కొవిడ్ పేషెంట్‌ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటే.. వారికి అమెజాన్ 14 రోజుల స్పెషల్ పెయిడ్ లీవ్‌ను ఇస్తోంది. అంతేకాదు తమ ఇంటి వద్దే ఐసీయూ సెటప్‌తో పాటు ఇతరత్రా 10 రకాల సదుపాయాల కల్పనకు సహాయం అందిస్తోంది. ఈ వివరాలతో కూడిన లిస్టును అమెజాన్ రిస్క్ ఇన్వెస్టిగేషన్స్ మేనేజన్ స్మృతి ఠాకూర్ షేర్ చేసింది.

టీసీఎస్..

ఇండియా వైడ్‌గా మొత్తం 11 నగరాల్లో కొవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటుచేసిన ఈ ఐటీ కంపెనీ.. హాస్పిటళ్లతో టైఅప్ అయిన పలు హోటళ్లలో కూడా ట్రీట్‌మెంట్‌కు ఏర్పాట్లు చేసింది. ఇక్కడ టీసీఎస్ ఉద్యోగులతో పాటు వారి ఫ్యామిలీ మెంబర్స్ కొవిడ్‌కు సంబంధించిన అత్యవసర మెడికల్ అసిస్టెన్స్‌ను పొందవచ్చు. ఈ సదుపాయాలే కాక ఉద్యోగులకు పెయిడ్ క్వారంటైన్ లీవ్స్‌, 24/7 హెల్ప్ డెస్క్, ఇతరత్రా ప్రయెజనాలను కల్పిస్తోంది.

క్యాప్‌జెమిని..

గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ క్యాప్‌జెమిని.. అర్హులైన ఎంప్లాయీస్‌తో పాటు వారి డిపెండెంట్స్‌ అందరికీ కొవిడ్ వ్యాక్సిన్స్ అందిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రోటోకాల్స్‌ను తూచ తప్పకుండా పాటిస్తోంది.

పేటీఎం..

కొవిడ్ కారణంగా చనిపోయిన తమ ఉద్యోగులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన శాలరీని కొనసాగించాలని నిర్ణయించిన పేటీఎం.. మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వెల్లడించింది. ఇక కంపెనీ ఉద్యోగులు, ఫ్యామిలీల కోసం ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల వంటి హోమ్ మెడికల్ ఎక్విప్‌మెంట్‌ను కొనుగోలు చేసినట్టు పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ ట్వీట్ చేశారు.

అర్బన్ కంపెనీ..

కంపెనీ సర్వీస్ పార్టనర్స్, వారి కుటుంబ సభ్యులకు మెడికల్ అసిస్టెన్స్2తో పాటు మరణించిన వారికి ఆర్థిక సాయం అందించేందుకు కొవిడ్-19 రిలీఫ్ ఫండ్‌ను ఏర్పాటు చేసింది.

ఐబీఎం..

ఈ మల్టీ నేషనల్ కంపెనీ.. ఇండియాలోని తన ఎంప్లాయీస్ అందరి కోసం హెల్త్ లైన్‌‌ను కేటాయించింది. ఈ మేరకు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నవారు మెడికల్ కేర్‌తో పాటు మెడికల్ ప్రొఫెషనల్స్ నుంచి కన్సల్టేషన్స్ పొందే అవకాశాన్ని కల్పించింది.

జొమాటో..

ఈ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్.. కొవిడ్ వల్ల మరణించిన తమ ఉద్యోగుల కుటుంబాలకు రెండు సంవత్సరాల వరకు 100 % శాలరీని అందిస్తామని ప్రకటించింది.

ఫ్లిప్‌కార్ట్..

ఇండియాలో ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అయిన ఫ్లిప్‌కార్ట్.. కంపెనీ ఉద్యోగులతో పాటు వారిపై ఆధారపడిన ఐదుగురికి ఉచితంగా వ్యాక్సినేషన్ చేయిస్తోంది.

స్టాన్‌ప్లస్..

అంబులెన్స్ సర్వీస్ కంపెనీ అయిన స్టాన్‌ప్లస్.. తమ స్టాఫ్‌కు ఫ్రీ క్వారంటైన్ ఫెసిలిటీస్‌తో పాటు ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసులను కల్పిస్తోంది. అంతేకాకుండా క్వారంటైన్ లీవ్స్‌ను సిక్ లీవ్స్‌గా పరిగణించబోమని, కొవిడ్ పరిస్థితుల వల్ల ఇబ్బందులు ఎదురైతే ఉద్యోగులు ఎప్పుడైనా లీవ్ తీసుకోవచ్చని తెలిపింది.

కాగా, కంపెనీలు చేపడుతున్న ఇటువంటి కార్యక్రమాల వల్ల ప్రతీ ఒక్కరికీ సురక్షితమైన పనిప్రదేశంలో పనిచేసే వీలు కలిగే అవకాశముంది.



Next Story

Most Viewed