ఘోర రోడ్డు ప్రమాదం.. వృద్ధ దంపతులను ఢీ కొట్టిన ఇసుక లారీ

by  |
ఘోర రోడ్డు ప్రమాదం.. వృద్ధ దంపతులను ఢీ కొట్టిన ఇసుక లారీ
X

దిశ, పరకాల : పరకాల పట్టణంలోని చలివాగు బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన పాలకుర్తి సమ్మయ్య (65) అక్కడికక్కడే మృతి చెందగా అతడి భార్య లక్ష్మి (కనకమ్మ) తీవ్రంగా గాయపడింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సమ్మయ్య, లక్ష్మిలు వారి ద్విచక్ర వాహనంపై దమ్మన్నపేట నుండి పరకాలకు పనిమీద వెళ్తున్న క్రమంలో కాళేశ్వరం వైపు నుండి వస్తున్న ఇసుక లారీ వెనక వైపు నుండి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో సమ్మయ్య అక్కడికక్కడే మృతి చెందగా, లక్ష్మికి బలమైన గాయాలు కావడంతో 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించిగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇసుక లారీ అతివేగం మూలంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలియజేస్తున్నారు.

కాగా వారం రోజుల లోపే ఇసుక లారీల మూలంగా ఇద్దరు మృత్యువాత పడి మరో ఇద్దరు తీవ్ర గాయాలకు గురికావడం పరకాలలో సంచలనంగా మారింది. ఇసుక లారీలు అతివేగం పట్ల పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ లారీ డ్రైవర్లు వారి ధోరణి మార్చుకోకపోవడం మూలంగా తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇందుకు గుంతలు పడిన రోడ్లు సైతం ప్రమాదాలకు కారణం అవుతుండడం గమనార్హం. ఈ రోడ్డు ప్రమాదం తెలిసిన వెంటనే పరకాల ఏసీపీ శివరామయ్య, ఇన్ స్పెక్టర్ మహేందర్ రెడ్డి, సబ్ ఇన్ స్పెక్టర్ ప్రశాంత్ బాబులు ఘటన స్థలం వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

Next Story

Most Viewed