ఇసై జ్ఞాని పుత్రుడి ఇస్లాం మత ప్రయాణం

by  |
ఇసై జ్ఞాని పుత్రుడి ఇస్లాం మత ప్రయాణం
X

మ్యూజిక్ మ్యాస్ట్రో, ఇసై జ్ఞాని ఇళయరాజా కుమారుడు యువన్ శంకర్ రాజా 2014లో ముస్లిం మతాన్ని స్వీకరించడం.. అప్పట్లో అభిమానులను షాక్‌కు గురిచేసింది. హిందూవాది అయిన ఇళయరాజా కొడుకు ముస్లిం మతాన్ని స్వీకరించడమేంటని చాలా మంది మదిలో ప్రశ్నలు తలెత్తాయి. కానీ సమాధానం దొరకలేదు. ఎట్టకేలకు ఆ కథేంటో వివరించారు యువన్.

ఇస్లాం మతంలోకి మారేందుకు ముందు తన భావోద్వేగ ప్రయాణం గురించి అభిమానులతో పంచుకున్నాడు. ఇస్లాంను ఎన్నుకున్న క్షణం గురించి చాలా మంది అడిగారు. కానీ అది ఒక క్షణం కాదు ప్రయాణమన్నారు. 2012లో ప్రపంచం అంతం అవుతుందని అని వార్తలు వచ్చిన సమయంలో ‘ఇది నిజమా అమ్మ..’ అని అడిగాడంట యువన్. ఆ సమయంలోనే వివిధ మతాలను పరిశీలించిన తాను.. ఖురాన్ పఠనం చేపట్టినట్లు తెలిపాడు. రెండు గంటలు చదివినా సరే అందులో అర్థాన్ని గ్రహించలేకపోయినట్లు చెప్పాడు. దీంతో ఖురాన్ చాలా కఠినమైందని భావించాడట యువన్. అయితే అమ్మ చనిపోయిన(2011) తర్వాత తన స్నేహితుడు మక్కా నుంచి మ్యాట్‌ను తెచ్చి ఇచ్చాడంట. నీకు బాధ కలిగినప్పుడు ఈ మ్యాట్‌పై కూర్చొని ప్రార్థన చేస్తే నీ బాధను దూరం చేస్తుందని సూచించాడట.

ఇది జరిగిన కొద్ది కాలం తర్వాత బంధువులతో కలిసి మాట్లాడుతున్నప్పుడు తన తల్లి గురించి టాపిక్ రాగా.. యువన్ చాలా ఆవేదనకు గురై గదిలోకి వెళ్లేసరికి అక్కడ చాప, అల్లాహ్‌ను సూచించే ఫార్వర్డ్ చిత్రం కనిపించిందట. ఆ చాప మీద కూర్చుని ఏడ్వడం ప్రారంభించిన యువన్.. ‘దయచేసి నేను చేసిన పాపాలకు నన్ను క్షమించు అల్లాహ్’ అని వేడుకున్నారట. అది చాలా ఎమోషనల్ మోమెంట్ అని.. నా లైఫ్‌లో టర్నింగ్ పాయింట్ అని తెలిపాడు యువన్. దీని తర్వాత ‘నేను ఖురాన్ డౌన్‌లోడ్ చేసుకుని మళ్లీ చదివినా అంతే కఠినంగా అనిపించింది. కానీ అప్పుడు నేను గ్రహించింది ఏంటంటే.. విశ్వం యొక్క సృష్టికర్త పవిత్ర పుస్తకం ద్వారా మనతో మాట్లాడతాడని.. అది అలాగే ఉంటుందని’ తెలిపాడు.



Next Story

Most Viewed