రెండేళ్లలో మా పార్టీ అధికారంలోకి వస్తుంది.. అప్పుడు చూపిస్తా.. షర్మిల సంచలన వ్యాఖ్యలు

by  |
రెండేళ్లలో మా పార్టీ అధికారంలోకి వస్తుంది.. అప్పుడు చూపిస్తా.. షర్మిల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ప్రభుత్వం వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల భర్తీ కోసం చేపట్టిన 72 గంటల దీక్షను ఆదివారం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో వైఎస్ షర్మిల విరమించారు. రవీంద్ర నాయక్ భార్య, కొడుకు చేతుల మీదుగా షర్మిల దీక్ష విరమించారు. ఈ సందర్భంగా నిరుద్యోగ అమరుల కుటుంబ సభ్యులను షర్మిల ఓదార్చారు. రవీంద్ర నాయక్ భార్య, కొప్పు రాజు తల్లి, మురళీ ముదిరాజు తల్లికి 50 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… రవీంద్ర నాయక్ పిల్లలను చూస్తే ఎవరికైనా కన్నీరు రాకుండా ఉంటుందా అంటూ షర్మిల తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పాలకులకున్నది గుండెనా.. బండరాయా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హంతకుడు అని, నిరుద్యోగులవి ఆత్మహత్యలు కాదని హత్యలు అని మండిపడ్డారు.

గడీల నుంచి దొరలు పాలిస్తుంటే, ప్రతిపక్షాలు తప్పులను ఎత్తిచూపకుండా, విమర్శించకుండా.. గాజులేసుకొని వత్తాసు పడుతున్నాయని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణలో పాలకులకు, పోలీసులకు సిగ్గుండాలని, తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్‌పై పోలీసులు మా చీరలు లాగారు, నా చేయి విరిచారు, ఒక తమ్ముడి కాలు విరగగొట్టారని సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ తన రాజకీయ స్వలాభం కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని, ఉద్యోగాలు కల్పించడం ఆయన చేత కానిపని అని అన్నారు. తెలంగాణలో నోటిఫికేషన్లు వచ్చే వరకు ప్రతి సమావేశంలో నిరసన తెలుపుతానని తెలిపారు. ‘పోరాడుతా.. నేను నిలబడతా.. మిమ్మల్ని నిలబెడతా’ అని నినదించారు. రెండేళ్లలో మన పార్టీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు ప్రైవేట్ రంగంలో లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగం లేకుండా చేస్తామని, ఏ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకోవద్దని, ఏమి చేసైనా నిరుద్యోగ సమస్యను లేకుండా చేస్తా’’ అని షర్మిల అన్నారు.


Next Story

Most Viewed