హుజురాబాద్‌ ఎన్నికలతోనే కేసీఆర్‌కు ప్రేమ పుట్టింది: వైఎస్ షర్మిల

by  |
హుజురాబాద్‌ ఎన్నికలతోనే కేసీఆర్‌కు ప్రేమ పుట్టింది: వైఎస్ షర్మిల
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ముఖ్యమంత్రి దళితుడే అవుతాడు.. ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల వ్యవసాయ భూమి, ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తాం’ అని చెప్పిన కేసీఆర్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని వైఎస్ షర్మిల అన్నారు. కానీ, ఇప్పుడేమో దళితులపై కేసీఆర్ ఆకస్మిక ప్రేమ చూపిస్తున్నారని.. అందుకు హుజురాబాద్ ఉప ఎన్నిక కారణమంటూ షర్మిల ఎద్దేవా చేశారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని ఖండే బల్లుర్‌లో వై‌ఎస్ఆర్ టీసీ ఆధ్వర్యంలో దళిత భేరి సభ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో షర్మిల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌‌కు దళితులపై చిత్తశుద్ధి లేదన్నారు. రాష్ట్రంలో దళితులకు దళిత బంధు కింద ఇవ్వాల్సింది రూ. 10 లక్షలు కాదన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మూడెకరాల భూమి, దాని పై ఆదాయం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి కలుపుకొని ఒక్కొక్కరికి రూ. 60 నుంచి 70 లక్షలు ఇవ్వాలన్నారు. కానీ, టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దళితులపై 800 అక్రమ కేసులు నమోదు అయ్యాయని షర్మిల విమర్శించారు.

రాష్ట్రంలోనే జుక్కల్‌ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏది అని ఆమె ప్రశ్నించారు. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణలోనే వెనుకబడిన నియోజకవర్గంగా మిగిలిందన్నారు. నియోజకవర్గానికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎన్ని కేటాయించారు.. ఎంత మందికి ఇచ్చారు మూడెకరాలు అంటూ షర్మిల ఫైర్ అయ్యారు. నాగమడుగు ఎత్తిపోతలకు మోక్షం ఇంకెప్పుడన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో నిజాంసాగర్, కౌలాస్ నాలా ప్రాజెక్ట్‌లు ఉన్నా.. ఎందుకు వరి పండించలేని పరిస్థితి ఉందంటూ నిలదీశారు. వెనుక బడిన నియోజకవర్గానికి ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీ ఎంతో చెప్పాలంటూ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌టీపీ అధికార ప్రతినిధి సత్యవతి, జహీరాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జీ బొడిగె సంజీవ్, నిజామాబాద్ పార్లమెంట్ కన్వీనర్ తిరుపతి రెడ్డి, పిట్టల రాం రెడ్డి, రఫిక్ తదితరులు పాల్గొన్నారు.

Next Story