సెన్సార్ లేదు కదా అని చెలరేగితే..

by  |
సెన్సార్ లేదు కదా అని చెలరేగితే..
X

దిశ, వెబ్‌డెస్క్ : డిజిటల్ మాధ్యమాలు వచ్చాక ప్రతి ఒక్కరూ తమ కళను చూపించుకోవడానికి ఒక మార్గం దొరికింది. ఒకప్పుడు పరిమిత స్థాయిలో ఉండి, నియమనిబంధనల ఆధారంగా విడుదలయ్యే ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్‌కు ఈ మాధ్యమాల వల్ల రెక్కలు వచ్చాయి. దీని కారణంగా రోజుకో రకమైన కొత్తదనాన్ని కోరుకునే యూజర్‌కు కొత్త కంటెంట్‌ను ఇవ్వడానికి కంటెంట్ క్రియేటర్లు కష్టపడుతున్నారు. అయితే కొన్ని నియమ నిబంధనలను పాటిస్తూ ఇబ్బందికర, అశ్లీల కంటెంట్‌కు చాలామటుకు దూరంగానే ఉంటున్నారు. కానీ యూజర్‌కు అశ్లీల కంటెంట్ కూడా అవసరమే అనుకునే కొందరు మాత్రం విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా వోక్స్-పాప్ ఫార్మాట్ చానళ్లు ఈ విషయంలో హద్దు దాటుతున్నాయి. వోక్స్-పాప్ అంటే ఒక మైక్ పట్టుకుని ఎక్కువగా జనాలు వెళ్లే ప్రదేశాలకు వెళ్లి అక్కడ ఏదో ఒక అంశం మీద కనపడినవారిని అభిప్రాయం అడగడం.

అయితే ఇలా అభిప్రాయం అడగడంలో కొన్ని ఇంట్రెస్టింగ్, ఫన్ టాపిక్‌లు అయితే ఓకే కానీ.. ఏకంగా సెక్స్, మద్యపానం, అక్రమ సంబంధాలు, బూతుల గురించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం కొందరికి ఇబ్బందిగా ఉండవచ్చు. ఇటీవల చెన్నై టాక్స్ అనే తమిళ యూట్యూబ్ చానల్ ఇలాంటి వీడియో చేయడంలో భాగంగానే సెక్స్ గురించి ఒక మహిళను అడిగింది. ఆ వీడియో వైరల్ అవడంతో అది చూసి ఇబ్బందిగా ఫీలయిన వాళ్లు ఆ చానల్ గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పోలీసులు.. చానల్ ఓనర్ దినేష్, వీజే ఆసెన్ బాద్‌షాలతో పాటు కెమెరా పర్సన్ అజయ్ బాబును కూడా అరెస్ట్ చేశారు. ఈ యూట్యూబ్ చానల్ వాళ్లు అడుగుతున్న ప్రశ్నలు చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయని కొందరు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీడియోలో సెక్స్, డ్రింకింగ్, లాక్‌డౌన్ గురించి మాట్లాడిన ఆ మహిళ గురించి కామెంట్లలో చాలా మంది అసభ్యంగా మాట్లాడారు. అది వైరల్ అవడంతో ఆ మహిళ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

ఈ సంఘటనను బట్టి చూస్తే తెలుగులో కూడా హద్దు దాటుతున్న కొన్ని యూట్యూబ్ చానళ్లు ఉన్నాయి. ఎక్స్‌పోజింగ్‌కు, బూతు మాటలకు ప్రాధాన్యమిస్తూ ప్రాంక్ వీడియోలు, స్కెచ్ వీడియోలు చేస్తున్న చానళ్లు పాపులర్ అవుతున్నాయి. అయితే ఇవి చూసి ఎవరన్నా ఇబ్బంది పడిన వాళ్లు పోలీసులకు తెలియజేసే అవకాశం ఉందని చెన్నై సంఘటన గుర్తుచేసింది. యూట్యూబర్‌లు కంటెంట్ వైరల్ అవడం కోసం హద్దులు దాటకుండా, పరిమిత అశ్లీలత, వినదగిన బూతులతో కంటెంట్‌ను క్రియేట్ చేస్తే అటు సమాజం, ఇటు ఇంటర్నెట్ రెండూ బాగుపడతాయని డిజిటల్ మాధ్యమాల నిపుణులు చెబుతున్నారు.


Next Story

Most Viewed