తహశీల్దార్ సాక్షిగా ఆర్ఐపై యువకుడు దాడి

by  |
తహశీల్దార్ సాక్షిగా ఆర్ఐపై యువకుడు దాడి
X

దిశ, భద్రాచలం :
తహశీల్దార్ సాక్షిగా రెవిన్యూ ఇన్ స్పెక్టర్‌పై ఓ యువకుడు చేయి చేసుకొన్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో చోటుచేసుకొంది. లింగాపురం గ్రామానికి చెందిన గుర్రం వెంకటేశ్వర్లు (కొండ) అనే యువకుడు ఆరోగ్య శ్రీ కార్డు కోసం దరఖాస్తు చేసి కార్యాలయం చుట్టు తిరుగుతున్నాడు.‌ దాదాపు నెలరోజులు అవుతున్నా ఆరోగ్య శ్రీ కార్డు మంజూరు చేయకుండా రెవిన్యూ ఉద్యోగులు తీవ్ర జాప్యం చేయడంపై యువకుడు ఆగ్రహించాడు. సోమవారం చర్ల టౌన్ ఆర్ఐ జమ్లానను తన చాంబర్‌లో యువకుడు కలిశాడు. ఇంకా ఎన్ని రోజులు పడిగాపులు పడాలి, ఇలా ఎంతకాలం ఆఫీసు చుట్డూ తిరగాలంటూ ఆర్ ఐని నిలదీశాడు. అంతటితో ఆగకుండా కోపంతో రగిలిపోతూ అందరు చూస్తుండగానే ఆ యువకుడు ఆర్ఐని లాక్కొని తహసీల్దార్ చాంబర్‌కు తీసుకెళ్ళాడు. అక్కడ తహసీల్దార్ అనిల్‌కుమార్ ముందు ఆర్ఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆవేశంతో అతను చేయిచేసుకున్నాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. దీనిపై పోలీసులకు తహశీల్దార్ అనిల్ ఫోన్ చేశారు. దీంతో యువకున్ని పోలీసులు అరెస్టు చేశారు.

దీనిపై బాధితుడు ఆర్ఐ జమ్లా మాట్లాడుతూ….ఆరోగ్య శ్రీ కార్డు కోసం ఆ యువకుడు దరఖాస్తు చేసి చాలా రోజులైందని తెలిపారు. అయితే 21 రోజుల క్రితం తన తండ్రి చనిపోతే తాను సెలవు పెట్టి వెళ్ళాననీ, సోమవారం వచ్చి విధులకు హాజరైనట్లు తెలిపారు.‌ తాను సెలవుపై వెళ్ళేటపుడు ఈ కార్డు గురించి ఆ గ్రామ వీఆర్వో‌కి చెప్పినట్లు తెలిపారు. తాను చెప్పేది వినకుండా ఆ యువకుడు మద్యం తాగివచ్చి దాడి చేశాడని తెలిపారు.


Next Story