ఆ యువకులు చేసిన పనికి అధికారులు మేల్కొంటారా..?

by  |
Road repair
X

దిశ, భునవగిరి రూరల్ : ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ఆ యువకులే సమస్య పరిష్కారానికి నడుం బిగించారు. ప్రజల ప్రాణాలను కాపాడడానికి సంకల్పించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు మేల్కొనేలా రోడ్డు మరమ్మతులు చేసి ప్రజల మన్ననాలు పొందుతున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో నిత్యం రద్దీగా ఉండే రహదారుల్లో వలిగొండ – నాగారం మెయిన్ రోడ్డు ఒకటి. ఈ రోడ్డుపై అడుగుకో గుంత ఏర్పడి ప్రయాణికులకు ప్రాణసంకటంగా మారింది. గుంతల్లో వర్షం నీరు చేరి ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో ఈ రోడ్డుకు మరమ్మతులు చేయాలని మండల ప్రజలు అధికారులు, ప్రజాప్రతినిధులను కోరినా స్పందించలేదు. దీంతో వర్షాలకు పెద్దగా మారుతున్న గుంతలను వలిగొండకు చెందిన యువకులు ముందుకు వచ్చి పూడ్చివేశారు. తాత్కాలికంగా ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ ఆర్ అండ్ బీ అధికారులు, ఎమ్మెల్యే స్పందించి వెంటనే నూతన రోడ్డును నిర్మించాలని కోరారు. అలాగే మారుమూల గ్రామాల రోడ్లు సైతం అధ్వానంగా మారాయని, వర్షాల వల్ల ప్రమాదాలు జరగుతున్నందున వాటిని కూడా మరమ్మతులు చేయాలని కోరారు. ప్రధాన రహదారిపై సూచిక బోర్డులు, డైవర్షన్ బోర్డులు, కిలోమీటర్ల కొలత రాళ్లు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, వాటిని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి పార్టీ మండల అధ్యక్షుడు బుంగ సునీల్, బర్ల నర్సింహా, మైసోళ్ల సత్యం, యండీ ఖలీం, మంగ శ్రీధర్, కట్ట భిక్షం పాల్గొన్నారు.


Next Story

Most Viewed