పెండ్లి వద్దన్న యువతి.. ఇళ్లు తగులబెట్టిన యువకుడు.. క్లైమాక్స్‌లో పోలీసులు..!

by  |
పెండ్లి వద్దన్న యువతి.. ఇళ్లు తగులబెట్టిన యువకుడు.. క్లైమాక్స్‌లో పోలీసులు..!
X

దిశ, జవహర్‎నగర్: తనను పెళ్లి చేసుకోవాలంటూ ఓ యువతిని వేధింపులకు గురి చేయడమే కాకుండా, ఒప్పుకోకపోవడంతో సదరు యువకుడు ఇంటిని తగులబెట్టాడు. ఈ ఘటన జవహర్‎నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీజేఆర్‌నగర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. సీఐ భిక్షపతి రావు, ఎస్సై సాయిలు తెలిపిన వివరాల ప్రకారం.. బీజేఆర్‌నగర్-మల్లికార్జుననగర్‌లో నివాసం ఉంటున్న నవీన్ (23) ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. గత రెండు సంవత్సరాలుగా ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని పెళ్లి పేరుతో వేధించసాగాడు. యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో బెదిరింపులకు పాల్పడ్డాడు.

ఈ నెల 10న యువతి నానమ్మ ఆరోగ్యం బాగా లేకపోవడంతో సొంతూరుకు వెళ్లారు. ఇదే సమయంలో యువతి కుటుంబ సభ్యులు బంధువుల సహాయంతో మరో యువకుడితో పెళ్లి చేసేందుకు నిశ్చయించారు. ఈ విషయం తెలుసుకున్న నవీన్ ఈ నెల 22న ఊర్లో ఉండే యువతి బంధువుకి ఫోన్ చేసి బెదిరించాడు. బీజేఆర్‌నగర్‌లోని వారి ఇంటిని తగులబెడతా అంటూ హెచ్చరించారు. అన్నట్టుగానే ఆ పని చేశాడు.. దీంతో చుట్టుపక్కల వారు యువతి కుంటుంబీకులకు సమాచారం అందించారు. ఈ నెల 23న బీజేఆర్‌నగర్‌కు వచ్చిన బాధితులు ఇంటిని పరిశీలించగా ఇంట్లోని సామాగ్రి కాలిపోయినట్టు గుర్తించారు. నవీన్ తమ కుమార్తెతో వివాహానికి నిరాకరించడంతో కక్ష పూరితంగా ఇంటిని తగలబెట్టినట్లు యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.



Next Story