పెళ్లై 6నెలలే.. భార్య నల్లగా ఉందని చంపిన భర్త

by  |
పెళ్లై 6నెలలే.. భార్య నల్లగా ఉందని చంపిన భర్త
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్నెళ్ల క్రితమే ఏడు అడుగులు నడిచారు. అందరి సాక్షిగా మనువాడుకున్నారు. కోట్ల ఆశలతో సంసారంలోకి అడుగు పెట్టారు. భవిష్యత్ ఆనందంగా ఉండాలని ఆరాటపడ్డారు. కానీ ఆ సంతోషం వారికి ఎంతోకాలం నిలువలేదు. కొద్దిరోజులకే నవ దంపతుల మధ్య గొడవలు.. చీటికి మాటికి పంచాయితీలు… ఈ వివాదాన్ని పెద్దది చేస్తూ… భర్త సంసారాన్ని ఆగం చేశాడు. భార్య నల్లగా ఉందన్న సాకుతో చిత్రహింసలతో నరకం చూపెట్టాడు. ఇక నాతో ఉండొద్దని చెప్పి పుట్టింట్లో దించి వచ్చాడు. అయినా ఆ నవవధువు భవిష్యత్‌ ఆలోచించి కన్నవారికి కనీసం ముచ్చటైనా చెప్పలేదు. ఇంతలో లాక్‌డౌన్.. సమస్య మరింత ముదరడంతో ఇద్దరి మధ్య మాటలు బంద్ అయ్యాయి. తర్వాత ప్రెజర్ పెరగడంతో భార్యను 20రోజుల క్రితం ఇంటికి తీసుకువచ్చిన భర్త.. మళ్లీ వేధింపులు మొదలు పెట్టాడు. ప్రతిరోజు నల్లగా ఉందని తిడుతూ ఇబ్బందులు పెట్టాడు. ఇక భార్యను ఎలాగైనా వదిలించుకోవాలనుకున్న భర్త.. మంగళవారం దారుణానికి ఒడిగట్టాడు. హైదరాబాద్‌లో జరిగిన దారుణ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

అనంతపురం జిల్లాకు చెందిన యోగి అనే యువకుడికి తన మేడకోడలు అరుణతో ఆర్నెళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహ వేడుక సమయంలో వరకట్నాలు బాగానే ఇచ్చారు. మేనమామ కావడంతో తమ కూతురిని మంచిగా చూసుకుంటాడని భావించి అడిగినన్ని డబ్బులు, బంగారం పెట్టారు. కానీ యోగి.. ఇంతకు ముందే వేరే యువతితో ప్రేమ వ్యవహారం నడపడంతో.. మేనకోడలుతో వివాహాన్ని అస్సలు ఒప్పుకోలేదు. ఇటు మేనకోడలు కావడం, తల్లిదండ్రులు, బంధువుల నుంచి ఒత్తిడి పెరగడంతో కొద్దిగా మెత్తబడి వివాహం చేసుకున్నాడు. పెళ్లి అయిన కొద్దిరోజులకే బంధాన్ని వదిలించుకోవాలనుకున్న యోగి.. రెండు మూడు సార్లు భార్యను తీవ్రంగా కొట్టి ఇంటి వద్ద దింపేసి వచ్చాడు.

ఇదే క్రమంలో యోగి తల్లిదండ్రులు.. అరుణను కాపురానికి తీసుకురావాలని చెప్పడంతో ఇంట్లో గొడవలు జరిగాయి. ఇక చేసేదేమీ లేక 20రోజుల క్రితం యువతిని ఇంటికి తీసుకువచ్చిన యోగి.. భార్య అరుణను నల్లగా ఉన్నావంటూ చిత్రహింసలు పెడుతూ ప్రతిరోజు కొడుతున్నాడు. నీవల్ల.. నేను ప్రేమించిన అమ్మాయికి దూరమై నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని తిడుతూ టార్చర్ చేశాడు. ఇదే క్రమంలో మంగళవారం ఉదయం దంపతుల మధ్య వాగ్వాదం జరగడంతో కోపంతో ఊగిపోయిన యోగి.. భార్య అరుణను హత్య చేశాడు. అనంతరం తాను గొంతు కోసుకోని ఆత్మహత్యాయత్నం చేయగా.. తల్లిదండ్రులు అడ్డుకున్నారు. వెంటనే మళ్లీ ఇంట్లోకి వెళ్లి.. పినాయిల్ తాగడంతో స్పృహ తప్పిపోగా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story

Most Viewed