యెస్ బ్యాంక్ సంక్షోభం..వ్యవస్థాపకుడి ఇంట్లో ఈడీ సోదాలు!

by  |
యెస్ బ్యాంక్ సంక్షోభం..వ్యవస్థాపకుడి ఇంట్లో ఈడీ సోదాలు!
X

దిశ, వెబ్‌డెస్క్ : యెస్ బ్యాంక్ విషయంలో ఆర్‌బీఐ నిర్ణయం అనంతరం ఆ బ్యాంకు వ్యవస్థాపకుడైన రానా కపూర్‌కు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి, లుక్ఔట్ నోటీసులు ఇచ్చారు. . శుక్రవారం ముంబైలోని ఆయన నివాసంలో సోదాల అనంతరం ఈ చర్యలు తీసుకుంది. మనీ లాండరింగ్ కేసులో భాగంగా ఆయనతో పాటు మరికొంత మంది యెస్ బ్యాంకు అధికారులపై అక్రమ నగదు చలామణి అంశంలో ఆరోపణలు ఉన్నాయి. డీహెచ్ఎల్ఎఫ్ బ్యాంకు ఋణాలు నిరర్ధక ఆస్తులుగా ఉన్నాయి. ఇందులో రానా కపూర్ పాత్ర కూడా ఉందన్న అనుమానాలతో అధికారులు ఆయనని ప్రశ్నించినట్టు వెల్లడించారు. మరో కార్పొరేట్ సంస్థకు ఇచ్చిన ఋణాలకుగానూ వారి నుంచి రానా కపూర్ డబ్బు తీసుకున్నాడన్న అభియోగాలున్నాయి. ఆ నగదు రానా భార్య అకౌంట్‌కు చేరవేసినట్టు ఆధారాలు ఉన్నట్లు, యెస్ బ్యాంకు సంక్షోభానికి జరిగిన అవకతవకల్లో రానా కపూర్ పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యెస్ బ్యాంకులో అవకతవకలు జరిగాయని చెప్పిన విషయం తెలిసిందే. గత మూడేళ్ల నుంచి యెస్ బ్యాంకు వ్యవహారాలను ఆర్‌బీఐ పరిశీలిస్తోందని ఆమె అన్నారు. పాలకపరమైన సమస్యలు, బలహీనతలు, తప్పుడు ఆస్తుల వర్గీకరణను గుర్తించినట్టు తెలిపారు. వీటన్నిటినీ గమనించి యెస్ బ్యాంకు యాజమాన్యాన్ని మార్చేందుకు ఆర్‌బీఐ ఆలోచిస్తోందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఇటువంటి సందర్భంలో రానా కపూర్ ఇంట్లో సోదాలు నిర్వహించడం సంబంధిత వర్గాల్లో ప్రాధాన్యతగా మారింది.

Tags: Rana Kapoor, Enforcement Directorat, DHFL Scam, Money Laundering

Next Story

Most Viewed