నాలుగు దశాబ్దాలుగా శిలాఫలకాలకే పరిమితం

by  |
నాలుగు దశాబ్దాలుగా శిలాఫలకాలకే పరిమితం
X

దిశ, ఇబ్రహీంపట్నం: ఆ గిరిజన రైతులు నాలుగు దశాబ్దాల క్రితమే సాగునీటి కోసం అన్వేషించారు. ఎత్తయిన రెండు కొండల నడుమ రిజర్వాయర్ ​నిర్మిస్తే బీడు భూములు సస్యశ్యామలమవుతాయని ఆశించారు. ఎగువన ఉన్న అటవీ ప్రాంతాలనుంచి వచ్చే నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసి ఒడిసి పట్టాలని ప్రణాళికలు రూపొందించారు. అనుకున్నదే తడవుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. నాటి ఎన్టీఆర్​ ప్రభుత్వ హయాంలో తొలి విడతగా రూ.లక్ష కేటాయించి శిలాఫలకం వేశారు. నాటి నుంచి నేటి వరకు వరుసగా నిర్మాణ వ్యయం పెంచుతూ శిలాఫలకాలకు శంకుస్థాపన చేయడం తప్పితే పనులు ప్రారంభించిన పాపాన పోలేదు. ఇదీ రంగారెడ్డి జిల్లా మంచాల మండల పరిధిలోని గాడివంపు వాగు కన్నీటి వ్యథ.

రంగారెడ్డి జిల్లా మంచాల మండల పరిధిలోని ఎల్లమ్మతండాను సస్యశ్యామలం చేయాల్సిన గాడివంపు వాగు దశాబ్దాలుగా శిలాఫలకానికే పరిమితమైంది. సుమారు 143 ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో మినీ రిజర్వాయర్​ ఏర్పాటుకు నాటి దివంగత సీఎం ఎన్టీఆర్ హయాంలోనే ప్రతిపాదనలు చేశారు. ఎతైన రెండు కొండల నడుమ వాగుపై కట్టను నిర్మించేందుకు నాటి ప్రభుత్వం సంకల్పించింది. ఇక్కడ కట్టను ఏర్పాటు చేయడంతో వర్షపు నీటిని నిల్వచేయవచ్చు. ఎగువన ఉన్న చీదేడ్ రంగాపూర్ల అటవీ ప్రాంతాల నుంచి ఈ రిజర్వాయర్ కు నీటి ప్రవాహం ఉంటుంది. ఈ రిజర్వాయర్ ఏర్పాటుతో దిగువనున్న గాడివంపు నిర్మాణం జరిగితే సుమారు 12 గ్రామాల ప్రజలకు, 5వేల ఎకరాలకు నీరందనుంది. పదివేల మంది గిరిజన రైతులకు లబ్ధిచేకూరనుంది.

ఎల్లమ్మతండా, బోడకొండ, కొర్రతండా, సతితండా ఆంబోతుతండా, లోయపల్లి గ్రామాల్లో భూగర్భజలాలు పెరిగే అవకాశముంది. ఈ రిజర్వాయర్ కింద 143 ఎకరాల ఆయకట్టు నిర్మాణ సామర్థ్యంతో నాటి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. 2003లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నాటి మంత్రి దేవేందరగౌడ్ రెండో సారి ఈ రిజర్వాయర్ నిర్మాణానికి రూ.53లక్షలు కేటా యించి శంకుస్థాపన చేశారు. నాటి నుంచి నేటి వరకు శిలాఫలకానికే పరిమతమైంది. నిర్మాణానికి మాత్రం నోచుకోలేదు. ముఖ్యమంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు మారినా గిరిజన రైతుల కల మాత్రం నెరవేరలేదు. ఈ ప్రాజెక్టు నిర్మిస్తే కొన్ని వందల మంది రైతులతో పాటు, వేల ఎకరాలకు సాగు నీటికి ఢోకా ఉండదని స్థానిక నాయకులు పేర్కొన్నారు.

Next Story

Most Viewed