తిరుపతి లోక్​సభ వైసీపీదే

by  |
తిరుపతి లోక్​సభ వైసీపీదే
X

దిశ, ఏపీ బ్యూరో : తిరుపతి లోక్​సభ ఫలితం అంతా ఊహించినట్లే వైసీపీకే అనుకూలమైంది. పది రౌండ్లు లెక్కింపు పూర్తయ్యే సరికి వైసీపీ అభ్యర్థి డాక్టర్ మద్దెల గురుమూర్తి రెండు లక్షల ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. టీడీపీ రెండో స్థానానికే పరిమితమైంది. ఈ పాటికే వైసీపీకి 4,47,819 ఓట్లు లభించగా టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 2,47,406 ఓట్లు దక్కాయి. జనసేన బలపర్చిన బీజేపీ అభ్యర్థి రత్న ప్రభకు నోటాలో పది శాతం కూడా రాలేదు. ఆమెకు 42,334 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్​అభ్యర్థి చింతా మోహన్​కు 5,828, సీపీఎం అభ్యర్థి నెల్లూరు యాదగిరికి 3,569 ఓట్లు దక్కాయి. ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే వైసీపీ 57 శాతం, టీడీపీ 31.63, బీజేపీ 5.34, కాంగ్రెస్​0.89, సీపీఎం 0.52, ఇతరులు 3.25, నోటా1.41 శాతం ఓట్లు వచ్చాయి.

తిరుపతి లోక్​సభ నియోజకవర్గానికి సంబంధించి చిత్తూరు జిల్లాలోని తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఈ మూడు నియోజకవర్గాల లెక్కింపు తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్​కళాశాలలో కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా పరిధిలోని వెంకటగిరి, గూడూరు, సర్వేపల్లి, సూళ్లూరుపేట నియోజకవర్గాలకు సంబంధించి నెల్లూరులోని డీకే మహిళా కళాశాలలో లెక్కింపు జరుగుతోంది. ప్రస్తుతానికి పది రౌండ్లు పూర్తయ్యాయి. ఇంకా 15 రౌండ్ల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది.

ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభమైంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు ముందస్తుగా పూర్తిస్థాయి బందోబస్తు చర్యలు తీసుకున్నారు. తిరుపతిలో పోస్టల్​బ్యాలెట్లు లెక్కింపు సందర్భంగా వైసీపీకి 2,500, టీడీపీకి 500 రావడంతో ఆ పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మి కౌంటింగ్​కేంద్రం నుంచి వెళ్లిపోయారు. టీడీపీ పార్లమెంటరీ నియోజవర్గ ఇన్​చార్జి నరసింహయాదవ్​ మాట్లాడుతూ ఇదంతా దొంగ ఓట్ల లెక్కింపు అని వ్యాఖ్యానించారు. వీళ్ల దురాగతాలను వెంకటేశ్వరస్వామి క్షమించరని విమర్శించారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాలపై వైసీపీ ఎన్నికల ఇన్​చార్జి వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ.. సీఎం వైఎస్​జగన్​అమలు చేస్తున్న నవరత్నాలకు ప్రజలు ఇస్తున్న బహుమతిగా పేర్కొన్నారు. నాలుగు లక్షలకు పైగా ఆధిక్యం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed