కరోనా కనిపిస్తే ఫడ్నవీస్ నోట్లో కుక్కుతా : శివసేన ఎమ్మెల్యే

by  |
కరోనా కనిపిస్తే ఫడ్నవీస్ నోట్లో కుక్కుతా : శివసేన ఎమ్మెల్యే
X

ముంబయి : మహారాష్ట్రలో రెమిడెసివిర్ రగడ అధికార శివసేన, ప్రతిపక్ష బీజేపీల మధ్య చిచ్చు రేపుతున్నది. రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన రెమిడెసివిర్ ఇంజెక్షన్ల సరఫరాను కేంద్ర సాయంతో బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారని శివసేన ఆరోపిస్తున్నది. ఆదివారం ఇదే విషయమై శివసేన ఎమ్మెల్యే ఒకరు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుల్దానా నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ స్పందిస్తూ.. ఒకవేళ తనకు కరోనా వైరస్ కనిపిస్తే దానిని తీసుకెళ్లి దేవేంద్ర ఫడ్నవీస్ నోట్లో కుక్కుతానని వ్యాఖ్యానించారు. ఈ సంక్షోభ సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సాయం అందించాల్సింది పోయి ప్రభుత్వాన్ని ఎలా కూల్చాలో కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు.

ఫడ్నవీస్, బీజేపీ నాయకులు ప్రవీణ్ దరేకర్, చంద్రకాంత్ పాటిల్‌లు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని గైక్వాడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మహారాష్ట్ర ఆఫీసు నుంచి గుజరాత్‌కు రెమిడెసివిర్‌లను సరఫరా చేస్తు్న్నారని ఆయన ఆరోపించారు. మహారాష్ట్రకు రెమిడెసివిర్ నిలిపేయాలని కేంద్ర ప్రభుత్వం సంబంధిత కంపెనీలను ఆదేశించిందని శివసేన ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో దమణ్ కేంద్రంగా పనిచేసే బ్రూక్ ఫార్మా రెమిడెసివిర్లను విదేశాలకు ఎగుమతి చేస్తుందన్న ఆరోపణలతో ఆ సంస్థ డైరెక్టర్ డొకానియాను అదుపులోకి తీసుకున్నారు. దీంతో బీజేపీ నేతలు ఫడ్నవీస్, దరేకర్‌లు హుటాహుటిన పోలీస్ స్టేషన్‌కు వెళ్లి డొకానియాకు మద్దతుగా మాట్లాడటం పలు అనుమానాలకు దారి తీసింది.

Next Story