భారతీయ సిబ్బందిని కలిసేందుకు అనుమతిస్తాం: ఇరాన్ కీలక ప్రకటన

by Dishanational2 |
భారతీయ సిబ్బందిని కలిసేందుకు అనుమతిస్తాం: ఇరాన్ కీలక ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్‌కు సంబంధించిన కార్గో షిప్‌లో ఉన్న 17 మంది భారతీయులను కలిసేందుకు ఇండియన్ అధికారులను అనుమతిస్తామని ఇరాన్ సోమవారం వెల్లడించింది. సీజ్ చేసిన ఓడ వివరాలను పరిశీలిస్తున్నామని, త్వరలోనే భారత ప్రభుత్వ ప్రతినిధులు ఆ నౌకలో ఉన్న సిబ్బందితో సమావేశం కావొచ్చని ఇరాన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అమీర్ అబ్దుల్లాహియాన్ తెలిపారు. గాజాలో యుద్ధాన్ని ఆపడానికి యూఎన్ఓ భద్రతా మండలితో సహా అంతర్జాతీయ సంస్థల ద్వారా భారత్ తమ పాత్రను కొనసాగించాలని పేర్కొన్నారు. భారతీయ సిబ్బందిని రిలీజ్ చేయాలని అమీర్ అబ్దుల్లాహియాన్‌తో విదేశాంగ మంత్రి జైశంకర్ ఆదివారం ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ ప్రకటన చేయడం గమనార్హం.

ఈ నెల13న ఇజ్రాయెల్‌కు చెందిన కార్గో షిప్ భారతదేశానికి వస్తుండగా ఇరాన్ స్వాధీనం చేసుకుంది. అందులో 17 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. దీంతో వారిని విడిపించేందుకు భారత ప్రభుత్వం చర్చలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రితో చర్చలు జరిపారు. ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని సూచించారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కూడా పిలుపునిచ్చారు. దౌత్య మార్గాలకు సంబంధించిన ప్రాధాన్యతలను సైతం నొక్కి చెప్పారు. ఇరాన్ సైతం దీనికి సానుకూలంగా చర్చించినట్టు తెలిపారు.



Next Story

Most Viewed