90 మంది ప్రాణాలు తీసిన కలరా భయం..ఏమైందంటే?

by Dishanational2 |
90 మంది ప్రాణాలు తీసిన కలరా భయం..ఏమైందంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: మొజాంబిక్ దేశంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లగా ప్రమాదవశాత్తు పడవ నీటిలో మునిగిపోయింది. మొజాంబిక్ ఉత్తర తీరంలో జరిగిన ఈ ఘటనలో 90 మందికి పైగా మరణించినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. 130 మందితో ఉన్న ఫిషింగ్ బోటు నాంపులా ప్రావీన్సులోని ఓ ద్వీపానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలిపారు. విషయం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు ఐదుగురిని రక్షించారు. మరింత మందిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మృతుల్లో అధిక సంఖ్యలో పిల్లలు ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రమాదానికి గల కారణాలను వెల్లడించనప్పటికీ..పడవలో పరిమితికి మించి ప్రయాణిస్తుండటంతోనే బోటు నీటిలో మునిగిపోయినపట్టు అధికారులు భావిస్తున్నారు. ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. ప్రాణాలతో బయటపడిన ఐదుగురిని ఆస్పత్రికి తరలించారు. సముద్రంలో పరిస్థితి కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌కు అంతరాయం కలుగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా, మొజాంబిక్ దేశం ఆఫ్రికా ఆగ్నేయ తీరంలో ఉంటుంది.

ఈ ఘటనను నాంపుల ప్రావీన్స్ సెక్రటరీ జైమ్ ధ్రువీకరించారు. చాలా మంది ప్రజలు కలరా వ్యాప్తి గురించి తప్పుడు సమాచారం రావడంతో భయాందోళలనకు గురవుతున్నారని, ఈ క్రమంలోనే మొజాంబిక్ నుంచి తప్పించుకుని దీవుల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. దీంతో ఫిషింగ్ బోట్‌లో అధిక సంఖ్యలో వెళ్తున్నందువల్లే పడవ నీటిలో మునిగినట్టు వెల్లడించారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం..గతేడాది అక్టోబర్ నుంచి మొజాంబిక్‌లో 15వేల కలరా కేసులు నమోదుకాగా..32 మంది మరణించారు. ఈ కారణంగానే ప్రజలు ఆందోళనకు గురవుతున్నట్టు సమాచారం.



Next Story

Most Viewed