పాక్‌లో కలకలం..11మందిని చంపిన ఉగ్రవాదులు

by Dishanational2 |
పాక్‌లో కలకలం..11మందిని చంపిన ఉగ్రవాదులు
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌లో ఉగ్ర ఘటనలు కలకలం రేపుతున్నాయి. బలూచిస్థాన్ ప్రావీన్సులో రెండు వేర్వేరు ఘటనల్లో ఉగ్రవాదులు 11మందిని చంపినట్టు అధికారులు శనివారం వెల్లడించారు. మొదటి ఘటనలో క్వెట్టా నుంచి తఫ్తాన్‌కు వెళ్తున్న ఓ బస్సును నోష్కీ జిల్లాలోని హైవేపై ఆపి..ప్రయాణికులను బెదిరింపులకు గురి చేసి అందులోని 9 మందిని కిడ్నాప్ చేశారు. అనంతరం వారిని చంపేసి స్థానిక పర్వత ప్రాంతాల్లో పడేశారు. మరో ఘటనలో అదే రహదారిపై వెళ్తున్న ఓ కారుపై ఉగ్రవాదులు కాల్పులు జరపగా..ఇద్దరు ప్రయాణికులు మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై బలూచిస్థాన్ ముఖ్యమంత్రి మీర్ సర్ఫరాజ్ బుగ్తీ స్పందించారు. దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకుంటామని తెలిపారు. శాంతి భద్రతలకు కాపాడటమే తమ లక్ష్యమని వెల్లడించారు. అంతర్గత మంత్రి మొహ్సిన్ నఖ్వీ కూడా ఈ ఘటనను ఖండించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

అయితే ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఈ హత్యలకు బాధ్యత వహించలేదు. ఇటీవల బలూచిస్థాన్ ప్రావీన్సులో ఉగ్రదాడులు విపరీతంగా పెరిగాయి. భద్రతా దళాలే లక్ష్యంగా అనేక దాడులు జరిగాయి. నిషేధిత బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఇటీవల మాచ్ టౌన్, గ్వాదర్ పోర్ట్, టర్బాట్‌లోని నావికా స్థావరంపై దాడి చేసింది. ఇందులో భద్రతా బలగాలతో సహా 17 మంది ఉగ్రవాదులు సైతం మరణించారు. అంతేగాక గత నెల 26న ఖైబర్ ఫంఖ్తుఖ్వా రాష్ట్రంలో జరిగిన దాడిలో ఐదుగురు చైనా పౌరులు మృతి చెందారు.



Next Story

Most Viewed