ఇరాన్‌లో మరో ముగ్గురికి ఉరి.. అంతర్జాతీయంగా మరింత ఒంటరి అయ్యే ప్రమాదం

by Disha Web Desk 17 |
ఇరాన్‌లో మరో ముగ్గురికి ఉరి.. అంతర్జాతీయంగా మరింత ఒంటరి అయ్యే ప్రమాదం
X

టెహ్రాన్: ప్రభుత్వ వ్యతిరేక నిరసన ప్రదర్శనల సందర్భంగా గత ఏడాది నవంబరులో ముగ్గురు భద్రతా దళాల మరణానికి కారకులనే ఆరోపణలతో ముగ్గురు ఆందోళనకారులను ఇరాన్ ప్రభుత్వం శుక్రవారం ఉరి తీసింది. సలేహ్ మిర్హాషేమీ, మాజిద్ కజెమీ, సయీద్ యాకూబీలను శుక్రవారం తెల్లవారుజామున ఉరి తీసినట్లు కోర్టు వెబ్ సైట్ ప్రకటించింది.

ఉరిశిక్ష అమలు చేస్తారన్న పుకార్ల నేపథ్యంలో వారిని నిర్బంధించిన జైలు వెలుపల జనాలు గురువారం రాత్రి నుంచే గుమిగూడారు. భద్రతా దళాల మరణానికి వీళ్లే కారణమనడానికి ఖచ్చితమైన ఆధారాలను చూపించడంలో ఇరాన్ అధికారులు విఫలమవడంతో ఉరిశిక్షలను నిలిపివేయాలని మానవ హక్కుల సంఘాలు ఇరాన్ లోపల, బయట ప్రచారం చేసినా ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోలేదు.

దీంతో ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల సంఘాలు భగ్గుమన్నాయి. మృతులకు వారి కుటుంబ సభ్యులతో బుధవారం చివరిసారి కలిసే అవకాశం కల్పించారు. హిజాబ్ ధరించలేదని నెపంతో 22 ఏళ్ల మహిళను గత ఏడాది సెప్టెంబర్ లో కాల్చి చంపడానికి వ్యతిరేకంగా దేశంలో ఆందోళనలు పెచ్చరిల్లాయి.

ఈ నిరసనల సందర్భంగా హింసాకాండకు పాల్పడ్డారన్న నెపంతో ఇరాన్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏడుగురిని ఉరి తీసింది. వీరికి న్యాయస్థానంలో తమ వాదనను వినిపించే అవకాశం కూడా కల్పించలేదు. ఈ చర్యతో ఇరాన్ అంతర్జాతీయంగా మరింత ఒంటరి అయ్యే ప్రమాదం నెలకొంది.


Next Story

Most Viewed