ప్రపంచం మరిన్ని యుద్ధాలను భరించలేదు: యూఎన్ఓ చీఫ్ ఆంటోనియో గుటెర్రస్

by Dishanational2 |
ప్రపంచం మరిన్ని యుద్ధాలను భరించలేదు: యూఎన్ఓ చీఫ్ ఆంటోనియో గుటెర్రస్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్-ఇజ్రాయెల్ వివాదంపై ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యప్రాచ్య ప్రాంతం పతనం అంచున ఉందని, ఆ ప్రాంతంతో పాటు ప్రపంచ దేశాలన్నీ మరిన్ని యుద్ధాలను తట్టుకోలేవని తెలిపారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్యలు తీవ్రతరం కాకముందే పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం నేపథ్యంలో నిర్వహించిన యూఎన్ఓ భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇరాన్-ఇజ్రాయెల్ సంయమనం పాటించాలని సూచించారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్ చేసిన దాడిని, ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ చేసిన అటాక్‌ను గుటెర్రస్ ఖండించారు. మధ్యప్రాచ్యంలోని అనేక రంగాల్లో సైనిక ఘర్షణలకు దారితీసే ఏ చర్యలనైనా నియంత్రించాలని తెలిపారు. గాజాలోనూ తక్షణమే కాల్పుల విరమణ చేపట్టాలని వెల్లడించారు.

స్వతంత్ర భద్రత కోసమే దాడి చేశాం: యూఎన్ఎస్సీలో ఇరాన్

యూఎన్ఎస్సీ అత్యవసర సమావేశంలో ఇరాన్ రాయబారి అమీర్ ఎర్వానీ మాట్లాడుతూ..ఇరాన్ యుద్ధం కోరుకోవడం లేదని, దేశ స్వతంత్ర భద్రత కోసమే దాడి చేశామని తెలిపారు. ఐక్యరాజ్యసమితిలోని ఆర్టికల్ 51 ప్రకారం ఇరాన్‌కు దాడి చేసే హక్కు ఉందని నొక్కి చెప్పారు. ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని, ఘర్షణను మరింత పెంచడం లేదని వెల్లడించారు. మరోవైపు ఇజ్రాయెల్ రాయబాది గిలాడ్ ఎర్డాన్ మాట్లాడుతూ.. ఇరాన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఆ దేశంపై ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు.

కాగా, డమాస్కస్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ చేసిన దాడికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్ పై విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఇజ్రాయెల్‌కు స్వల్ప నష్టం వాటిల్లింది. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లను ఇజ్రాయెల్, దానికి మద్దతిచ్చిన పలు దేశాలు కూల్చి వేశాయి. అయితే ఘర్షణ ముగిసిందని ఇరాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ అభ్యర్థన మేరకు యూఎన్ఎస్సీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది.

Next Story

Most Viewed