మరోసారి రెచ్చిపోయిన హౌతీలు: యూఎస్ నౌకలపై దాడి

by Dishanational2 |
మరోసారి రెచ్చిపోయిన హౌతీలు: యూఎస్ నౌకలపై దాడి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎర్ర సముద్రంలో హౌతీ మిలిటెంట్ల దాడులు ఆగడం లేదు. తాజాగా గల్ఫ్ ఆప్ ఎడెన్‌లో ప్రొపెల్ ఫార్చూన్ అనే బల్క్ క్యారియర్ పై దాడి చేసినట్టు హౌతీ గ్రూప్ మిలటరీ ప్రతినిధి యాహ్యా సారియా వెల్లడించారు. 37 డ్రోన్‌లను ఉపయోగించి ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లోని యూఎస్ యుద్ధ నౌకలపై కూడా దాడి చేసినట్టు తెలిపారు. దీనికి ప్రతిస్పందనగా యూఎస్ నావికా దళం ప్రయోగించిన 15 అన్‌క్రూడ్ ఏరియల్ వెహికల్స్‌ని నాశనం చేసిందని చెప్పారు. శనివారం తెల్లవారుజామున ఈ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. అయితే ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలను వెల్లడించలేదు. కాగా, ఇటీవల గల్ఫ్ ఆఫ్ అడెన్‌లోని ఓ వ్యాపార నౌక ట్రూ కాన్ఫిడెన్స్‌పై హౌతీలు క్షిపణి దాడి చేయగా ముగ్గురు మరణించిన విషయం తెలిసిందే. మరికొందరిని భారత నావికాదళానికి చెందిన ఐఎన్ఎస్ కోల్‌కతా రక్షించింది. యెమెన్‌లోని హౌతీ మిలిటెంట్లు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో గాజాకు మద్దతుగా అంతర్జాతీయ వాణిజ్య షిప్పింగ్‌కు వ్యతిరేకంగా డ్రోన్‌లు, క్షిపణులతో దాడులు చేస్తున్నారు. దీంతో ప్రపంచంలోని షిప్పింగ్ ట్రాఫిక్‌లో 15 శాతం వాటా కలిగి ఉన్న మార్గంలో ప్రపంచ వాణిజ్యానికి అంతరాయం ఏర్పడుతోంది. హౌతీ దాడులను ఎదుర్కోవడానికి 2023 డిసెంబర్ నుంచి యూఎస్ నేతృత్వంలోని నావికాదళం జలాల్లో పనిచేస్తోంది.

Next Story

Most Viewed