హర్మూజ్‌లో మళ్లీ హైటెన్షన్.. భారత్ చమురు ట్యాంకర్‌ను వెనక్కి పంపిన ఇరాన్!

by Ramesh Naini |

పశ్చిమాసియాలో చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో మళ్లీ హై టెన్షన్ వాతావరణం నెలకొంది.

హర్మూజ్‌లో మళ్లీ హైటెన్షన్.. భారత్ చమురు ట్యాంకర్‌ను వెనక్కి పంపిన ఇరాన్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమాసియాలో చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో మళ్లీ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒమన్ కారిడార్ గుండా ప్రయాణిస్తున్న ఒక భారతీయ చమురు ట్యాంకర్‌ను ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) బలగాలు అడ్డుకుని, వెనక్కి పంపినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ‘ఫార్స్’ వెల్లడించింది. అమెరికా పర్యవేక్షణలో, ఒమన్-అంతర్జాతీయ నౌకాయాన సంస్థ (IMO) ఏర్పాటు చేసిన తాత్కాలిక ఒమన్ కారిడార్‌ను కాకుండా.. తాము నిర్దేశించిన మార్గాన్నే విదేశీ నౌకలు ఉపయోగించాలని ఇరాన్ రేడియో హెచ్చరికలు జారీ చేస్తోంది. బుధవారం ఉదయం ఈ మార్గం గుండా వెళ్లిన నౌకలన్నీ ఇరాన్ సూచించిన రూట్‌లోనే ప్రయాణించాయని సదరు మీడియా సంస్థ పేర్కొంది. అయితే, ఈ ఘటనపై భారత అధికారులు గానీ, ఒమన్ లేదా అమెరికా వర్గాలు గానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు.

ముదిరిన ఉద్రిక్తతలు.. అమెరికా క్షిపణి దాడులు!

గడిచిన 24 గంటల్లో హర్మూజ్ జలసంధిలో కతార్ ఎల్‌ఎన్‌జీ క్యారియర్, సౌదీ చమురు ట్యాంకర్‌తో పాటు మరో వాణిజ్య నౌకపై దాడులు జరగడంతో ఈ ప్రాంతంలో భయాందోళనలు తీవ్రమయ్యాయి. ఈ దాడులకు ప్రతిచర్యగా రంగంలోకి దిగిన అమెరికా.. ఇరాన్‌కు చెందిన వైమానిక రక్షణ వ్యవస్థలు, కోస్టల్ రాడార్ సైట్లు, మరియు 60కి పైగా IRGC చిన్న బోట్లతో సహా మొత్తం 80 మిలిటరీ లక్ష్యాలపై భీకర దాడులు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా, అంతర్జాతీయ ఒప్పందంలో భాగంగా ఇరాన్‌కు ఇచ్చిన చమురు విక్రయాల లైసెన్స్‌ను కూడా వాషింగ్టన్ రద్దు చేసింది.

భారత్ ముందస్తు చర్యలు..

ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్ జలసంధిలో భారతీయ నౌకల సురక్షిత ప్రయాణం కోసం భారత ప్రభుత్వం ఇరాన్ అధికారులతో ముమ్మర చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

Next Story