ఫుట్‌బాల్ ఫీవర్.. ‘ఫిఫా’ ఫైనల్ కోసం ఏకంగా పరీక్షలనే వాయిదా వేసిన స్కూల్!

by Ramesh Naini |

కోల్‌కతా అనగానే ఫుట్‌బాల్.. ఫుట్‌బాల్ అనగానే కోల్‌కతా గుర్తుకురావడం సహజం. అక్కడ ఫుట్‌బాల్‌ను కేవలం ఒక ఆటలా కాకుండా మతంలా భావిస్తారు.

ఫుట్‌బాల్ ఫీవర్.. ‘ఫిఫా’ ఫైనల్ కోసం ఏకంగా పరీక్షలనే వాయిదా వేసిన స్కూల్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కోల్‌కతా అనగానే ఫుట్‌బాల్.. ఫుట్‌బాల్ అనగానే కోల్‌కతా గుర్తుకురావడం సహజం. అక్కడ ఫుట్‌బాల్‌ను కేవలం ఒక ఆటలా కాకుండా మతంలా భావిస్తారు. ఈ క్రేజ్‌ను గౌరవిస్తూ, ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2026) ఫైనల్ మ్యాచ్‌ కోసం కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక ‘సౌత్ పాయింట్ హైస్కూల్’ ఏకంగా తమ పరీక్షలనే వాయిదా వేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకి వెళితే.. భారత కాలమానం ప్రకారం జులై 20వ తేదీ అర్ధరాత్రి 12:30 గంటలకు ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్ ముగిసేసరికి చాలా ఆలస్యం అవుతుంది కాబట్టి, రాత్రంతా మేల్కొని మ్యాచ్ చూసిన విద్యార్థులు మరుసటి రోజు ఉదయం పరీక్ష రాయడం కష్టమని పాఠశాల యాజమాన్యం ముందే గ్రహించింది. విద్యార్థులు ఎలాంటి టెన్షన్ లేకుండా మ్యాచ్‌ను ఆస్వాదించాలనే ఉద్దేశంతో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు జరగాల్సిన పరీక్షల షెడ్యూల్‌ను మార్చింది.

మారిన పరీక్షల షెడ్యూల్ ఇదే..

జులై 20న జరగాల్సిన పరీక్ష, 29కి వాయిదా, జులై 21న జరగాల్సిన పరీక్ష,30కి పోస్ట్‌పోన్ చేసింది. ఈ నిర్ణయంపై స్కూల్ ప్రిన్సిపాల్ జయదేవ్ ఘోష్ మాట్లాడుతూ.. ‘ఫుట్‌బాల్ కేవలం ఒక ఆట మాత్రమే కాదు. అది కలిసికట్టుగా పనిచేయడం, ఒకరికొకరు సహకరించుకోవడం, సమష్టిగా పోరాడటం లాంటి ఎన్నో గొప్ప జీవిత విలువలను నేర్పిస్తుంది. ఈ చారిత్రాత్మక ఫైనల్ మ్యాచ్‌ను పిల్లలు పూర్తిగా చూసి ఆస్వాదించే అవకాశం కల్పించడమే మా ముఖ్య ఉద్దేశం’ అని స్పష్టం చేశారు. చదువుతో పాటు క్రీడలు కూడా పిల్లల మానసిక, సమగ్ర వికాసానికి ఎంతో తోడ్పడతాయని భావించిన విద్యార్థుల తల్లిదండ్రులు సైతం స్కూల్ తీసుకున్న ఈ వినూత్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతించారు.

గతంలోనూ పరీక్షలను వాయిదా వేసిన స్కూల్!

కాగా, మెగా టోర్నమెంట్ల కోసం ఇలా పరీక్షలు వాయిదా పడటం ఇదే తొలిసారి కాదు. గతంలో 2023 వన్డే క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ సమయంలోనూ ఫరీదాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాల తమ పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే.

Next Story