ఉపన్యాసాలు ఆపి..ఉగ్రవాద నియంత్రణఫై దృష్టి పెట్టండి: పాక్‌పై మండిపడ్డ భారత్

by Dishanational2 |
ఉపన్యాసాలు ఆపి..ఉగ్రవాద నియంత్రణఫై దృష్టి పెట్టండి: పాక్‌పై మండిపడ్డ భారత్
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌పై భారత్ మరోసారి విరుచుకు పడింది. ఉపన్యాసాలు ఇవ్వడం మానుకుని, ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించడంపై దృష్టి సారించాలని సూచించింది. సిట్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగిన ఇంటర్-పార్లమెంటరీ యూనియన్(ఐపీయూ) 148వ అసెంబ్లీలో భారత్ ప్రతినిధి బృందం ఈ వ్యాఖ్యలు చేసింది. భారత బృందానికి నాయకత్వం వహిస్తున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ సమావేశంలో భాగంగా ప్రసంగించారు. ఉగ్రవాద చర్యలకు మద్దతిస్తూ, వారికి ఆశ్రయం కల్పిస్తున్న దేశం మానవహక్కులపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉన్న దేశం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలిపారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, అనేక మంది భారత్‌ను ఆదర్శంగా తీసుకుంటారని కొనియాడారు.

జమ్మూకశ్మీర్‌పై పాక్ ప్రతినిధి బృందం చేసిన వ్యాఖ్యలను కూడా హరివంశ్ ప్రస్తావించారు. కశ్మీర్, లఢఖ్ ఎల్లప్పుడూ భారత్‌లో అంతర్భగమేనని ఆ ప్రాంతాలను ఎవరూ విడదీయలేరని నొక్కి చెప్పారు. నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని తెలిపారు. మానవహక్కుల కోసం పోరాడుతున్నామని చెబుతూనే జమ్మూ కశ్మీర్‌లో పాక్ సీమాంతర ఉగ్రదాదులను కొనసాగిస్తోందని తెలిపారు. వెంటనే టెర్రరిస్టు చర్యలను నియంత్రించడంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఉగ్రవాదులకు అగ్రనాయకుడైన ఒసామా బిన్ లాడెన్, ఆల్ ఖైదా వ్యవస్థాపకుడు కూడా పాకిస్థాన్‌లో కనుగొన్నట్టు గుర్తు చేశారు. అంతేగాక ఐక్య రాజ్యసమితి భద్రతా మండలి నిషేధించిన అత్యధిక మంది ఉగ్రవాదులు పాక్‌లోనే ప్రత్యక్ష మయ్యారని స్పష్టం చేశారు.

కాగా, అంతర్జాతీయ వేదికలపై భారత్ ఇటీవల పాకిస్థాన్‌పై విరుచుకుపడింది. గత నెలలో జరిగిన ఐక్యరాజ్యసమితి 55వ మానవ హక్కుల మండలి సమావేశంలోనూ భారతదేశ కార్యదర్శి అనుపమా సింగ్ పాక్, టర్కీలు లేవనెత్తిన జమ్మూ కశ్మీర్ ప్రస్తావనను తిరస్కరించారు. పాక్‌లోనే అధ్వాన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని గుర్తు చేశారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో పాక్‌దే కీలక పాత్ర అని మండిపడ్డారు.

Next Story

Most Viewed