- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేపాల్లో ఘోర ప్రమాదం : లోయలో పడ్డ మినీ బస్సు.. ఏడుగురు భారతీయ యాత్రికుల మృతి
నేపాల్లోని గోర్ఖా జిల్లాలో శనివారం సాయంత్రం జరిగిన భీకర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భారతీయ యాత్రికులు దుర్మరణం పాలయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: నేపాల్లోని గోర్ఖా జిల్లాలో శనివారం సాయంత్రం జరిగిన భీకర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భారతీయ యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. ప్రసిద్ధ మనకమాన ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న మిని బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. గోర్ఖా జిల్లాలోని షాహిద్ లఖన్ రూరల్ మున్సిపాలిటీ పరిధిలోని కాంతార్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. తాజాగా జిల్లా పోలీస్ కార్యాలయ డీఎస్పీ రాజ్ కుమార్ శ్రేష్ట తెలిపిన వివరాల ప్రకారం.. యాత్రికులతో వెళ్తున్న ఎలక్ట్రిక్ మైక్రో బస్సు నిటారుగా ఉన్న రహదారిపై అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే రక్షణ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం భరత్పూర్లోని చిత్వాన్ మెడికల్ కాలేజీకి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో డజనుకు పైగా ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని అధికారులు వెల్లడించారు.
పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు..
నేపాల్లో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. 2024 ఆగస్టులో కూడా భారత యాత్రికుల బస్సు ప్రమాదానికి గురై 27 మంది ప్రాణాలు కోల్పోయారు. నేపాల్ ట్రాఫిక్ పోలీస్ రికార్డుల ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 7,669 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 190 మంది మరణించారు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం, రోడ్డు ప్రమాదాల కారణంగా నేపాల్ ఎదుర్కొంటున్న ఆర్థిక నష్టం ఆ దేశ జీడీపీలో 1.5 శాతానికి చేరుకుంది. మరణిస్తున్న వారిలో 70 శాతానికి పైగా పాదచారులు, సైకిలిస్టులు, ద్విచక్ర వాహనదారులే ఉండటం గమనార్హం.






