భారత్‌కు ఎంక్యూ9బీ డ్రోన్ల విక్రయం: యూఎస్ కీలక వ్యాఖ్యలు

by Dishanational2 |
భారత్‌కు ఎంక్యూ9బీ డ్రోన్ల విక్రయం: యూఎస్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎంక్యూ9బీ సాయుధ డ్రోన్లు భారత సముద్ర భద్రతను ఎంతో మెరుగుపరుస్తాయని యూఎస్ తెలిపింది. ఇటీవల 31 ఎంక్యూ9బీ డ్రోన్లను భారత్‌కు అందించాలని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రకటించిన నేపథ్యంలో యూఎస్ తన నిర్ణయాన్ని వెల్లడించింది. ‘ఎంక్యూ9 బీ డ్రోన్లు భారత్‌కు సముద్ర భద్రత, సముద్ర డొమైన్ అవగాహన సామర్థ్యాన్ని పెంపొందిస్తాయని నమ్ముతున్నాం’ అని యూఎస్ విదేశాంగ శాఖ డిప్యూటీ ప్రతినిధి వేదాంత్ పటేల్ తెలిపారు. భారత్‌తో భాగస్వామ్యాన్ని మరింత కొనసాగిస్తామని వెల్లడించారు. కాగా, 2023 జూన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ యూఎస్ పర్యటనలో భాగంగా అమెరికా-భారత్‌ల మధ్య ఈ డ్రోన్ ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి దీనిపై చర్చలు కొనసాగగా ఇటీవలే భారత్‌కు విక్రయించనున్నట్టు యూఎస్ తెలిపింది. మరోవైపు ఈ డీల్‌పై డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ (డీఎస్‌సీఏ) స్పందించింది. ‘ఈ అగ్రిమెంట్ యూఎస్, భారత్‌ల వ్యూహాత్మక సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. అంతేగాక స్థిరత్వం, శాంతి పద్దతుల్లో ప్రధాన రక్షణ సంబంధాన్ని మెరుగుపర్చడం ద్వారా యూఎస్ విదేశాంగ విధానం జాతీయ భద్రతా లక్ష్యాలకు మద్దతు ఇస్తుంది’ అని తెలిపింది.

Next Story

Most Viewed