రోమ్, కాశీలు శాశ్వత నగరాలు.. ఇటలీ పర్యటనలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |   (  Updated:2026-05-20 13:05:27  IST  )

ఐదు దేశాల పర్యటనలో భాగంగా చివరి విడతగా ఇటలీ చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి అక్కడ ఘన స్వాగతం లభించింది.

రోమ్, కాశీలు శాశ్వత నగరాలు.. ఇటలీ పర్యటనలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఐదు దేశాల పర్యటనలో భాగంగా చివరి విడతగా ఇటలీ చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. ఇటలీ ప్రధాని జార్జియా మెలొనీతో బుధవారం జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం ఇరు దేశాల సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచేందుకు, వ్యాపారం, పెట్టుబడులు, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇరు నేతలు అంగీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధాని మోడీ భారత్-ఇటలీ నాగరికతల బంధాన్ని ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

శాశ్వత నగరాల బంధం..

ప్రపంచవ్యాప్తంగా రోమ్‌ను ‘ఎటర్నల్ సిటీ’ (శాశ్వత నగరం)గా పిలుస్తారని, అలాగే తన లోక్‌సభ నియోజకవర్గమైన ‘కాశీ’ (వారణాసి) కూడా భారతదేశంలో అత్యంత పురాతన, శాశ్వత నగరమని మోడీ పేర్కొన్నారు. రెండు గొప్ప నాగరికతలు కలిసినప్పుడు చర్చలు కేవలం ఒక అజెండాకే పరిమితం కాకుండా, చరిత్ర లోతును, భవిష్యత్తు విజన్‌ను ప్రతిబింబిస్తాయని అన్నారు.

మెలొనీ నాయకత్వానికి ప్రశంసలు..

గత మూడేళ్లలో ప్రధాని మెలొనీని పలుమార్లు కలిసే అవకాశం దక్కిందని, ఆమె నాయకత్వంలో భారత్-ఇటలీ బంధం కొత్త వేగాన్ని, పరస్పర నమ్మకాన్ని సంతరించుకుందని మోడీ కొనియాడారు.

‘సంబంధ్’పై ఐస్‌లాండ్ ప్రధాని హర్షం..

ఈ పర్యటనకు ముందు నార్డిక్ దేశాల పర్యటనలో ‘సంబంధ్’ అనే పదంపై మోడీ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీనిపై ఐస్‌లాండ్ ప్రధాని క్రిస్ట్రూన్ ఫ్రోస్టాడోట్టిర్ స్పందిస్తూ.. సంబంధ్ అనేది స్వచ్ఛమైన ఐస్‌లాండ్ పదం కూడా అని, ప్రస్తుత ప్రపంచానికి ఇరు దేశాల మధ్య ఇటువంటి ‘సంబంధాలు’ ఎంతో అవసరమని వ్యాఖ్యానించారు. మోడీ తీసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల చొరవ వల్ల భారత్‌లో ఐస్‌లాండ్ పెట్టుబడులు పెరుగుతున్నాయని ఆమె హర్షం వ్యక్తం చేశారు.

Next Story