మరోసారి ‘మౌంట్ ఇబూ’ భారీ విస్ఫోటనం..4కిలోమీటర్లు ఎగిసిపడిన బూడిద

by samatah |
మరోసారి ‘మౌంట్ ఇబూ’ భారీ విస్ఫోటనం..4కిలోమీటర్లు ఎగిసిపడిన బూడిద
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇండోనేషియాలోని మారుమూల ద్వీపమైన హల్మాహెరాలో ఉన్న మౌంట్‌ ఇబూ అగ్నిపర్వతం మరోసారి బద్దలైంది. ఈశాన్యం, తూర్పు దిశగా ఆకాశంలోకి నాలుగు కిలోమీటర్ల మేర బూడిదను విరజిమ్మింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సమీపంలోని ఏడు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించారు. చుట్టుపక్కల గ్రామాల నివాసితులను ఖాళీ చేయడానికి పోలీసు, మిలటరీ, సెర్చ్ అండ్ రెస్క్యూ అధికారులతో కూడిన జాయింట్ టీమ్‌ను ఆ ప్రాంతంలో మోహరించినట్టు విపత్తు ఉపశమన ఏజెన్సీ అధికారి అబ్దుల్ ముహారి ఓ ప్రకటనలో తెలిపారు. వారికి తాత్కాలికంగా ఉపశమనం కల్పించినట్టు వెల్లడించారు. ఏడు కిలోమీటర్ల వరకు ఉన్న ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు పంపించినట్టు తెలిపారు. ఇబూ విస్ఫోటనం చెందుతున్న పోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నెల ప్రారంభంలోనూ ఇబూ అనేక సార్లు విస్ఫోటనం చెందింది. దీంతో ఇండోనేషియా అగ్నిపర్వత శాస్త్ర ఏజెన్సీ అగ్నిపర్వత హెచ్చరిక స్థాయిని అత్యధిక స్థాయికి పెంచింది. అలాగే ఉత్తర సులవేసిలోని రుయాంగ్ అగ్నిపర్వతం కూడా ఇటీవల విస్ఫోటనం చెందిన విషయం తెలిసిందే. దీంతో 12,000 మందికి పైగా ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు.



Next Story

Most Viewed