పంజాబ్ మంత్రి అసభ్యకర ఫొటోలు వైరల్

by Shamantha N |

పంజాబ్‌ (Punjab) మంత్రి మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటకొచ్చాయి. దీంతో, ఈ విషయంపై రాష్ట్రంలో రాజకీయ దుమారం చెలరేగింది.

పంజాబ్ మంత్రి అసభ్యకర ఫొటోలు వైరల్
X

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్‌ (Punjab) మంత్రి మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటకొచ్చాయి. దీంతో, ఈ విషయంపై రాష్ట్రంలో రాజకీయ దుమారం చెలరేగింది. ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రి రవ్‌జోత్‌ సింగ్‌ (Ravjot Singh) ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు లీకయ్యాయి. కాగా.. ఈ అంశంపై మంత్రి రవ్‌జోత్‌ పోలీసులను సంప్రదించారు. తన వ్యక్తిగత, రాజకీయ ప్రతిష్టను దిగజార్చడానికి ఉద్దేశపూర్వక చేసిన ప్రయత్నమని ఖండించారు. శిరోమణి అకాలీదళ్ నేత బిక్రమ్‌ సింగ్‌ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అవి ఏఐతో సృష్టించినవన్నారు. తన మాజీ భార్యతో దిగిన ఫొటోలను మార్ఫ్ చేశారని ఆరోపించారు. ఆ పార్టీ తనపై వ్యక్తిగతంగా దాడి చేయడమే కాకుండా.. ఓ మహిళ గౌరవాన్ని అవమానించిందన్నారు. సమాజంలోని మహిళలపై వారికున్న గౌరవం ఏంటనేది ఇలా బయటపడిందన్నారు. లూథియానా ఉప ఎన్నికల్లో ఆప్ పార్టీ చేతిలో ఓడిపోతామనే భయంతోనే ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడుతుందన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని.. చట్టపరంగా ముందుకువెళ్తామన్నారు. అధికారిక ఫిర్యాదు దాఖలైందని.. దీనిపై దర్యాప్తు జరుగుతోందన్నారు. ఇది తన గురించి మాత్రమే కాదని.. పంజాబ్ రాజకీయాల్లో ఇలాంటి దుర్మార్గపు ప్రచారాలను సహించబోమని చెప్పుకొచ్చారు.

అసలేం జరిగిందంటే?

శిరోమణి అకాలీదళ్ నేత బిక్రమ్‌ సింగ్‌ ఆప్ మంత్రికి చెందిన అసభ్యకర ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. రవ్‌జోత్‌కు చెందిన ఫొటోలను బిక్రమ్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు. దీనికి ‘ఆప్‌ ప్రభుత్వంలోని మంత్రి మహిళల గౌరవానికి భంగం కలిగించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలి. మంత్రి పదవి నుంచి తొలగించాలి’ అని రాసుకొచ్చారు. ఈ పోస్టుకు ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌ (Bhagwant Mann Singh)లకు ట్యాగ్‌ చేశారు. మరోవైపు, ఈ వివాదంపై పార్టీకి చెందిన రాష్ట్ర యూనిట్‌ చీఫ్‌ అమన్‌ అరోరా మంత్రికి మద్దతుగా నిలిచారు. అకాలీదళ్‌ మురుగు రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు.

Next Story