భారత్‌‌ను చూసి నేర్చుకో..! అమెరికా మంత్రికి ఇరాన్‌ చురకలు

by Ramesh Naini |

భారత్‌లో అధికారిక పర్యటనకు విచ్చేసిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు ఇరాన్‌ నుంచి ఊహించని కౌంటర్ ఎదురైంది.

భారత్‌‌ను చూసి నేర్చుకో..! అమెరికా మంత్రికి ఇరాన్‌ చురకలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్‌లో అధికారిక పర్యటనకు విచ్చేసిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు ఇరాన్‌ నుంచి ఊహించని కౌంటర్ ఎదురైంది. ఆయన పర్యటనను ఉద్దేశిస్తూ భారత్‌లోని ఇరాన్‌ రాయబార కార్యాలయాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా తీవ్ర వ్యంగ్యాస్త్రాలు గుప్పించాయి. భారత్‌లో అడుగుపెట్టిన ఆయన ఇక్కడి ప్రజల నుంచి ‘సభ్యత’ నేర్చుకోవాలంటూ చురకలు అంటించాయి.

ముంబయి కాన్సులేట్ ‘క్రాష్ కోర్సు’ సెటైర్

ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే క్రమంలో శనివారం న్యూఢిల్లీ చేరుకున్న మార్కో రూబియో పర్యటనపై ముంబయిలోని ఇరాన్ కాన్సులేట్ స్పందించింది. అమెరికా మంత్రిని ఉద్దేశిస్తూ.. ‘కొంచెం నేర్చుకో మిత్రమా.. ‘సభ్యత క్రాష్ కోర్సు’ ఇక్కడ ఉచితంగా దొరుకుతుంది" (Thoda seekh lo yaar… ‘sabhyata ka crash course’ free mein mil jayega!) అని హిందీలో పోస్ట్ చేసింది.

హైదరాబాద్ కాన్సులేట్ సుతిమెత్తని చురకలు

మరోవైపు హైదరాబాద్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం కూడా అమెరికా మంత్రికి తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా చురకలు అంటించింది. ‘హిందూ మహాసముద్రం అంత విశాలమైన హృదయాలు ఉన్న ప్రజలు నివసించే నాగరికత (Civilization)లోకి మీరు అడుగుపెట్టారని మీరు గుర్తిస్తారని ఆశిస్తున్నాం’ అంటూ ట్వీట్ చేసింది. కాగా, భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసి, సరికొత్త దిశానిర్దేశం చేసేందుకు మార్కో రూబియో తొలిసారిగా అధికారిక పర్యటన నిమిత్తం భారత్ వచ్చారు. అయితే, ఆయన రాకతోనే అమెరికా - ఇరాన్ మధ్య ఉన్న వైరం సోషల్ మీడియా వేదికగా ఇలా సెటైర్ల రూపంలో బయటపడటం నెట్టింట ఆసక్తికరంగా మారింది.

Next Story